విరాళాల వెల్లువ

ABN , First Publish Date - 2021-10-29T05:57:36+05:30 IST

యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడానికి భక్తులనుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి.

విరాళాల వెల్లువ
మంత్రి మల్లారెడ్డి యాదాద్రి లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్న సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా కవచమూర్తులను ఫొటో తీసిన దృశ్యం

యాదాద్రి టౌన్‌, అక్టోబరు 28: యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడానికి భక్తులనుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్‌ యాదాద్రిక్షేత్రాన్ని సందర్శించిన సమయంలో ఆలయ అభివృద్ధిలో రాష్ట్ర ప్రజలను భాగస్వామ్యులను చేసేందుకు విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. దీంతో దేవస్థాన అధికారులు ప్రత్యేక క్యూ ఆర్‌ కోడ్‌ రూపొందించి, విరాళాల సేకరణ మొదలుపెట్టారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గురువారం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు. మేడ్చల్‌ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు యాదాద్రి ఆలయ విమాన గోపుర బంగారం తాపడం కోసం ఒక్కొక్కరు రూ.11 నుంచి మొదలై రూ.11లక్షల వరకు విరాళంగా అందజేశారని తెలిపారు. తాను ప్రకటించిన కిలో బంగారానికి సంబంధించిన నగదు కలిపి మేడ్చల్‌ జిల్లా నియోజకవర్గం నుంచి నగదు రూపంలో రూ.1,11,20,100, చెక్కుల రూపంలో రూ.72,21,145 మొత్తం రూ.1,83,41,245 విరాళాన్ని అందజేసినట్లు వివరించారు. రెండున్నర కిలోల బంగారాన్ని నియోజకవర్గం నుంచి ఇద్దామనుకున్నామని, అయితే మూడున్నర కిలోల వరకు బంగారం సమకూరిందని వెల్లడించారు. 


రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా : మంత్రి మల్లారెడ్డి

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని యాదాద్రి లక్ష్మీనృసింహుడిని కోరుకున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. విరాళం అందజేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, జిల్లా కార్మిక శాఖ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.  

Updated Date - 2021-10-29T05:57:36+05:30 IST