ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి
ABN , First Publish Date - 2021-05-21T07:06:20+05:30 IST
తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు.

కలెక్టర్ అనితా రామచంద్రన్
భువనగిరి రూరల్, మే 20: తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. మండల పరిధిలోని హన్మాపురం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అకాల వర్షానికి ధాన్యం తడిసిన విషయాన్ని రైతులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తూకం వేసిన ధాన్యం కాంటాలను జాప్యం చేయకుండా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తూకంవేసిన బస్తాలను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని డీసీవో పరిమళాదేవిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. కలెక్టర్ వెంట సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్సింహ, తదితరులు ఉన్నారు.