కొన్ని మిల్లుల్లోనే కొనుగోళ్లు

ABN , First Publish Date - 2021-10-27T06:22:00+05:30 IST

వానాకాలం సీజన్‌లో సన్నధాన్యం సాగుచేసిన రైతుల పరిస్థి తి దయనీయంగా మారుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని ఆరుగాలం శ్రమించిన కర్షకులు ధాన్యం విక్రయించేందుకు నానాఅగచాట్లు పడుతున్నారు.

కొన్ని మిల్లుల్లోనే కొనుగోళ్లు
మిర్యాలగూడలోని ఓ మిల్లుపాయింట్‌వద్ద వరుసకట్టిన ధాన్యం ట్రాక్టర్లు

 పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకోని వ్యాపారులు

టోకెన్‌ విధానం అమలు

మిల్లర్ల సిండికేట్‌, రైతాంగానికి పరీక్ష


మిర్యాలగూడ అర్బన్‌: వానాకాలం సీజన్‌లో సన్నధాన్యం సాగుచేసిన రైతుల పరిస్థి తి దయనీయంగా మారుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని ఆరుగాలం శ్రమించిన కర్షకులు ధాన్యం విక్రయించేందుకు నానాఅగచాట్లు పడుతున్నారు. జిల్లాలో వానాకా లం సీజన్‌లో ఎక్కువగా పూజ, 101, చింట్లు వంటి సన్నరకాల ను రైతులు సాగుచేశారు. ఈ ధాన్యం ద్వారా న్యాణమైన బియ్యం ఉత్పత్తి అవ్వాలంటే 22 నుంచి 25శాతం మధ్య తేమ ఉండాలని మిల్లర్లు చెబుతున్నారు. రైతులు వరి పంట ఆకుపచ్చ గా ఉండగానే నూర్పిడి చేసి ధాన్యాన్ని నేరుగా మిల్లుపాయింట్ల కు చేరుస్తున్నారు. దీంతో ధాన్యాన్ని పరీక్షిస్తున్న వ్యాపారులు కొర్రీలుపెట్టి మద్దతు ధర ఇవ్వకుండా అరకొర చెల్లిస్తున్నారు. మిల్లర్లంతా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. మరి కొందరు మిల్లర్లు మిల్లులోనే నేరుగా టోకెన్లు జారీచేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో టోకెన్ల కోసం రైతు లు ఉదయం నుంచే క్యూ లో నిల్చోవాల్సి వస్తోంది. టోకెన్‌ ఉన్న ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు కొనుగోలు చేస్తుండగా, వాటికోసం రైతులు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారులతో చీవాట్లు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.                                  


ధాన్యం కొనుగోళ్ల సమయంలో వ్యాపారుల ఆగడాలను నియంత్రిం చి రైతులకు మద్దతుగా నిలవాల్సిన అధికారయంత్రాంగం పత్తాలేకుం డా పోయింది. మార్కెటింగ్‌, రెవెన్యూ, సివిల్‌సప్లయ్‌, పోలీ్‌సశాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. వ్యాపారులు చెప్పిందే వేదం, ఇచ్చిందే రేటుగా మారింది. గత ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం విక్రయాల కోసం రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను అధికారులు స్వయంగా పరిశీలించారు. ఈ సీజన్‌లోనూ అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. దీం తో మిల్లుపాయింట్ల వద్ద నిత్యం వందలాది ధాన్యం ట్రాక్టర్లు క్యూలైన్ల లో కనబడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒక్క మిర్యాగూడలో ధాన్యం పరిశ్రమలు అధికంగా విస్తరించడంతో పరిసరప్రాంతాల నుంచి ధాన్యం ఇక్కడికి వస్తోంది. అయినా, జిల్లా అధికారయంత్రాంగం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.


సిండికేటైన మిల్లర్లు

మిర్యాలగూడ, సమీప ప్రాంతాల్లో 187 భారీ మిల్లులు ఉండగా, మ రో 120వరకు బిన్నీరై్‌సమిల్లులు ఉన్నాయి. భారీ మిలుల్ల యజమాను లు బిన్నీ రైస్‌మిల్లులను లీజుకు తీసుకొని ఐకేపీ ద్వారా దిగుమతి చేసుకున్న దొడ్డుధాన్యాన్ని ఇక్కడ మరాడించి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను సివిల్‌సప్లయ్‌శాఖకు అప్పగిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో సన్నబియ్యానికి మంచి డిమాండ్‌ ఉండటంతో ఉమ్మడి జిల్లా రైతులు వానాకాలం, యాసంగి సీజన్లలో ఈ రకాలనే మిల్లర్లు ఎక్కువగా కొనుగోలుచేస్తారు. రైతుల నుంచి నేరుగా పెద్దమొత్తంలో సేకరించిన సన్న ధాన్యంతో పచ్చిబియ్యం ఉత్పత్తిచేసి మన రాష్ట్రంతోపాటు ఏపీ, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. నస్నబియ్యం ఉత్పత్తి పెంచుకోవాలంటే అంతేస్థాయిలో ధాన్యం దిగుమతి అవసరం. అయితే సన్న రకం ధాన్యం కొనుగోలు సమయంలో మిల్లర్లు సిండికేట్‌గామారి రైతులకు మద్దతు ధర చెల్లించకుండా అందినకాడికి దండుకుంటున్నారు. ప్రతీ సీజన్‌ ప్రారంభంలో గంటకు 3 నుంచి 5టన్నుల బియ్యాన్ని ఉత్పత్తిచేసే రైస్‌మిల్లుల కు ప్రాధాన్యం ఇచ్చి మిగతా మిల్లర్లు ధాన్యం ఖరీదుకు దూరంగా ఉం టూ వస్తున్నారు. మిర్యాలగూడ-నల్లగొండ మార్గంలో నాలుగు భారీ మిల్లులు, యాద్గార్‌పల్లి-మిర్యాలగూడ మార్గంలో ఐదు భారీ మిల్లులు, సాగర్‌రోడ్డువైపు ఉన్న మరో భారీ మిల్లులు మాత్రమే ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ఆయా మిల్లుపాయింట్ల వద్ద నిత్యం వందలాది ధాన్యం వాహనాలు క్యూ కడుతున్నాయి. మిర్యాలగూడ, వేములపల్లి, యాద్గార్‌పల్లి ప్రాంతాల్లో విస్తరించిన మిల్లులో 75 మిల్లులు అత్యాధునిక టెక్నాలజీతో నడుస్తున్నాయి. వీటికి నిత్యం 150 నుంచి 200 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని మరాడించే సామర్ధ్యం ఉంది. వ్యాపారులంతా ఏకకాలంలో ధాన్యం ఖరీదు ప్రారంభిస్తే పోటీతత్వం పెరిగి రైతులకు మద్దతు ధర దక్కేది. అయితే వ్యాపారులు తెలివిగా వ్యవహరించి కొన్ని మిల్లుల్లోనే ధాన్యం కొనుగోలుచేస్తూ మద్దతు ధరకు మంగళం పాడుతున్నారని రైతుసంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.


అంతటా కొనుగోలు చేసేలా చూడాలి : షేక్‌ హన్ను, రైతు, వేములపల్లి

మిర్యాలగూడ పరిసరాల్లో ఉన్న అన్ని రైస్‌మిల్లుల్లో ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మిర్యాలగూడ, యాద్గార్‌పల్లి, వేములపల్లి రూట్లో కొన్ని మిల్లులోనే ధాన్యం ఖరీదు చేస్తున్నారు. మిల్లుపాయింట్ల వద్దకు ధాన్యం ట్రాక్టర్లు అధికంగా త రలివస్తున్నా కొందరువ్యాపారులే కొనుగోలు చేయడంతో వందలాది వాహనాలు వరుసకడుతున్నాయి. దిగుమతికోసం రాత్రి జాగారం చేయాల్సి వస్తోంది. దీనిపై అధికారయంత్రాంగం దృష్టిసారించాలి.


సమీక్షా సమావేశం నిర్వహిస్తాం : రోహిత్‌సింగ్‌, ఆర్డీవో, మిర్యాలగూడ

ధాన్యం విక్రయాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.మిల్లర్లతో డివిజన్‌స్థాయి సమీక్షా స మావేశం నిర్వహించి మిల్లుపాయింట్ల వద్దకు వచ్చే ధాన్యం కొనుగోళ్లు సాఫీగా కొనసాగేలా చూస్తాం.గత ఏడాది వానాకాలం పరిస్థితులు పునరావృతం కాకుండా వ్యవసాయ,రెవెన్యూ, పో లీ్‌సశాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం దిగుమతిచేసేలా వ్యాపారులకు దిశానిర్దేశం చేస్తాం.


సన్నధాన్యం మిర్యాలగూడకు

కొనుగోలుకు ముందుకురాని పేట మిల్లర్లు

సూర్యాపేట సిటీ: సన్న రకాలను సాగు చేసిన రైతులు ధాన్యం విక్రయించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేట జిల్లాలోని రైస్‌ మిల్లులు సన్నరకాలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు మిర్యాలగూడెం మిల్లులకు వెళ్లాల్సి వస్తోంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రాంతాల్లో 48కిపైగా పార్‌బాయిల్డ్‌ రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటికి నిత్యం 200క్వింటాళ్ల నుంచి 500క్వింటాళ్ల ధాన్యాన్ని మరాడించే సామర్ధ్యం ఉంది. ఈ మిల్లులో ధాన్యం కొనుగోలు ప్రా రంభిస్తే రైతులు ట్రాక్టర్లతో బారులుతీరే అవకాశం ఉందని మిల్లర్లు బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు గతంలో కొనుగోలు చేసిన ధాన్యా నికి కస్టం మిల్లింగ్‌ రైస్‌గా మార్చేపనిలో జిల్లా మిల్లర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో వస్తున్న ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో జిల్లా రైతులు ధాన్యాన్ని మిర్యాలగూడ ప్రాంతానికి తరలిస్తున్నారు.మార్కెట్‌లో క్వింటా ధాన్యానికి రూ.1,600 నుంచి రూ.1,750 ధర చెల్లిస్తున్నారు. రైస్‌ మిల్లుల వద్ద రూ.1,800 నుంచి రూ.1,900 వరకు ధర వస్తుండటంతో ఎక్కువమంది రైతు లు మిర్యాలగూడకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. జిల్లాలోని చివ్వెంల, సూర్యాపేట మండలాల రైతులు కేతేపల్లిమండలం భీమారం మీదు గా మిర్యాలగూడకు, పెన్‌పహాడ్‌, గరిడేపల్లి మండలాల రైతులు నేరేడుచర్ల మీదుగా మిర్యాలగూడకు ధాన్యాన్ని తరలిస్తున్నారు.


మిల్లర్లు ధర తగ్గిస్తున్నారు.: పత్తిపాక నరేష్‌, తూల్జారావుపేట, చివ్వెంల

ఎక్కువమంది రైతులు ధాన్యం విక్రయించేందుకు మిర్యాలగూడ మిల్లులకు వెళ్తుండగా, మిల్లర్లు ఏకమై ధర తగ్గిస్తున్నారు. రెండు రోజుల క్రితం సన్నరకాన్ని రూ.1900 చొప్పున కొనుగోలు చేసిన మిల్లర్లు, తాజాగా రూ.1,750 మాత్రమే చెల్లిస్తామంటున్నారు. ప్రభుత్వం సన్న ధాన్యానికి స్పష్టమైన ధర ఖరారు చేసి, అన్ని మిల్లుల్లో అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి.


Updated Date - 2021-10-27T06:22:00+05:30 IST