తెలంగాణ, ఏపీ మధ్య వాహన రాకపోకలపై ఆంక్షలు
ABN , First Publish Date - 2021-05-05T18:04:42+05:30 IST
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఏపీ సర్కార్ అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేశారు.

నల్లగొండ: తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఏపీ సర్కార్ అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులైన రామాపురం(కోదాడ), పొందుగుల(వాడపల్లి), నాగార్జున సాగర్(మాచర్ల వైపు)మూడు చెక్ పోస్టులను మూసివేశారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ల మూసివేతతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపిస్తే ఇరు రాష్ట్రాలలోకి అనుమతి ఇవ్వనున్నారు. కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు మినహాయింపు ఉంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందికి మినహాయింపు ఇచ్చారు. రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. బోర్డర్ చెక్పోస్ట్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది.