బండి సంజయ్ కాన్వాయ్పై కోడిగుడ్లతో టీఆర్ఎస్ శ్రేణుల దాడి
ABN , First Publish Date - 2021-11-15T21:28:33+05:30 IST
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది.
నల్గొండ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ వద్ద బండి సంజయ్ కారును నల్గొండ ఎమ్మెల్యే భూపాలరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ శ్రేణులకు పోటీగా బీజేపీ కార్యకర్తలు నినదించారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే భూపాలరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు పార్టీలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లురువ్వుకున్నారు. బండి సంజయ్ కాన్వాయ్పై కోడిగుడ్లతో టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ బాధ్యతను మరచి మాట్లాడుతున్నారని విమర్శించారు. పండిన ప్రతి గింజా కొంటామని గతంలో సీఎం చెప్పారన్నారు. సమస్య పరిష్కరించకుండా ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని, టీఆర్ఎస్ శ్రేణులు రైతుల్లా వచ్చి గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. వానాకాలంలో పంట మొత్తం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. గతేడాది 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రం కొనుగోలుచేసిందని, వరి మద్దతు ధరను రూ.1,960కు పెంచిందన్నారు. పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేస్తే కేసీఆర్ ఏం చేస్తారని ప్రశ్నించారు. రైతుల కోసం రాళ్ల దాడికి కూడా సిద్ధమేనని బండి సంజయ్ అన్నారు.