గ్రామాల్లో కనిపించని లాక్డౌన్
ABN , First Publish Date - 2021-05-20T05:57:55+05:30 IST
కరోనావైరస్ పట్టణాలతో పాటు పల్లెలకూ పాకింది. కరోనావ్యాప్తి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను గ్రామాల్లో పాటించడం లేదు.

యథావిధిగా కిరాణం, మద్యం బెల్ట్షాపుల నిర్వహణ
పల్లెల్లోనూ విజృంభిస్తున్న కరోనా
అయినా పట్టించుకోని అధికారగణం
చివ్వెంల, మే 19: కరోనావైరస్ పట్టణాలతో పాటు పల్లెలకూ పాకింది. కరోనావ్యాప్తి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను గ్రామాల్లో పాటించడం లేదు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఏ కార్యక్రమాలైనా, వ్యాపారాలైనా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, పల్లెల్లో సాధారణ రోజుల మాదిరే కిరాణ, బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కనీసం గ్రామపంచాయతీ, పోలీసు అధికారులు స్పందించడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. నిత్యం పర్యవేక్షించాల్సిన పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో సమయపాలన పాటించడంలేదు. కరోనా పాజిటివ్ వచ్చిన కుటుంబసభ్యులు సైతం గ్రామాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శుభకార్యాలు, అంత్యక్రియలు, దినకర్మలకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరవుతూనే ఉన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా వెలిసిన బెల్టు దుకాణాల్లో రేయీపగలు తేడా లేకుండా విక్రయాలు జరుగుతున్నాయి. బుధవారం చివ్వెంల మండలం తిరుమలగిరి, గుంపుల, వల్లభాపురం, ఉండ్రుగొండ, గుంజలూరుతో పాటు పలు గ్రామాలు, తండాల్లో బెల్ట్దుకాణాలు లాక్డౌన్ సడలింపు సమయం ముగిశాక కూడా తెరిచే ఉంచారు. దీనికి తోడు మద్యా నికి అధికధరలు వసూలు చేస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘించి చేపల విక్రయం
చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహడ్ గ్రామంలోని ఎటువంటి అనుమతులు లేకుండా చెరువులో బుధవారం చేపలు పట్టి విక్రయించారు. దీంతో ప్రజలంతా భౌతికదూరం మరిచి గుమిగూడారు. ఈ సమాచారాన్ని కొందరు యువకులు పోలీసులకు చెరవేయ డంతో వారు వచ్చి చేపల విక్రయాలను నిలిపివేశారు. గ్రామపంచాయతీకి సంబంధించిన వారు విక్రయించుకోవచ్చని చెప్పారని అక్కడికి వచ్చిన పోలీసులతో వాగ్వాదం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చిన వారిన చెదరగొట్టి వెళ్లిపోయారు.