కొవిడ్ నిబంధనలు తప్పసరి పాటించాలి
ABN , First Publish Date - 2021-09-03T06:27:26+05:30 IST
పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు.
పాఠశాలల్లో శానిటైజర్, మాస్కులు అందుబాటులో ఉంచాలి
అదనపు కలెక్టర్ రాహుల్శర్మ ఫ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం
దేవరకొండ, కనగల్, గుర్రంపోడు, సెప్టెంబరు 2: పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. దేవరకొండ ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 561మంది విద్యార్థులకు 36మంది, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 538 మంది విద్యార్థినులకు 50మంది మాత్రమే హాజరయ్యారు. విద్యార్థుల వివరాలను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకొని వివరాలను ఇన్చార్జి బక్కయ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్శర్మ మాట్లాడుతూ మునిసిపల్, గ్రామపంచాయతీల సిబ్బంది తప్పనిసరిగా పాఠశాలల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లో శానిటైజర్, మాస్క్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి రాహుల్శర్మ మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కొండమల్లేపల్లి, గుర్రంపోడు మండలం కొప్పోలు, కనగల్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన వెంట దేవరకొండ మునిసిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, కమిషనర్ వెంకటయ్య, కనగల్ ఎంఈఓ తరి రాములు, సర్పంచ్ సునీతకృష్ణయ్య, కార్యదర్శి ఆశ, గుర్రంపోడు ఎంపీడీవో సుధాకర్ తదితరులు ఉన్నారు.