స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన కేసీఆర్
ABN , First Publish Date - 2021-12-06T07:11:29+05:30 IST
రాష్ట్ర ఏర్పాటు నుంచి సీఎం కేసీఆర్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి వంగూరి లక్ష్మయ్య విమర్శించారు.
గెలుపుకోసం మద్యం, డబ్బు ఎర వేస్తున్న టీఆర్ఎస్
టీఆర్ఎస్ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తాం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి వంగూరి లక్ష్మయ్య
నల్లగొండ, డిసెంబరు 5: రాష్ట్ర ఏర్పాటు నుంచి సీఎం కేసీఆర్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి వంగూరి లక్ష్మయ్య విమర్శించారు. జిల్లాకేంద్రంలోని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివా్సరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్థానిక సంస్థలకు ఎలాంటి నిధులను కేటాయించలేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు సునాయసంగా చేసుకోవాలని చూస్తున్నారని, స్వతంత్ర అభ్యర్థులం ఆ పార్టీ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీ మద్యం, డబ్బు ఎరగా చూపి గెలుపు కోసం ప్రయత్నిస్తోందన్నారు. స్థానిక సంస్థల నిధులు కేటాయించకపోవడంతో టీఆర్ఎ్సకు ఓటు వేయడానికి ఓటర్లు సిద్ధంగా లేరన్నారు. సూర్యాపేట జిల్లాలో ఓ దళిత ప్రజాప్రతినిధి అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. గ్రామాల్లో ఎంపీటీసీలు, సర్పంచ్లు ఆస్తులను అమ్ముకొని అభివృద్ధి పనులు చేపట్టినా నిధులు విడుదల చేయడంలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీలను, కౌన్సిలర్లను క్యాంపులకు తరలించి ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. స్వతంత్రులు బరిలో నిలవడంతో ప్రభుత్వం రూ.250కోట్లను విడుదల చేసిందని, ఈ నిధులు సరిపోవన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివా్సరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందన్నారు. ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో తాము ప్రజలకు సేవ చేయలేకపోతున్నామన్నారు. నిధులన్నింటిని ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి స్థానిక సంస్థల ఓటర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులు ఆత్మ పరిశీలన చేసుకొని ఎవరికి ఓటు వేయాలనేది నిర్ణయించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి భిక్ష వేసినట్టుగా అరకొర నిధులు కేటాయిస్తున్నారని, తక్షణమే స్థానిక సంస్థలకు రూ.1000కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మనిమద్దె సుమన్, జిల్లెపల్లి పరమేశ్, సమద్, బాబా, లతీఫ్, ఇంతియాజ్, పెండెం రత్నమాల పాండు, సైదులు గౌడ్, బీరం స్వాతి కరుణాకర్రెడ్డి, దేశగాని నర్సింహా, బొజ్జ శంకర్, జూలకంటి ధనలక్ష్మీ, ఏర్పుల తర్షన, రవి, గడిగె శ్రీనివాస్ హిమబిందు, ఆనంద్కుమార్ పాల్గొన్నారు.