నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ABN , First Publish Date - 2021-10-25T06:11:29+05:30 IST
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25వతేదీ నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
హాజరుకానున్న ప్రథమ సంవత్సరం విద్యార్థులు
ఒక్క నిమిషం నిబంధన అమలు
ప్రతి పరీక్షా కేంద్రంలో ఐసోలేషన్ గది
జిల్లావ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాలు
భువనగిరి టౌన్, భువనగిరి రూరల్, అక్టోబరు 24: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25వతేదీ నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నవంబరు 2వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 65 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన 7,523మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ విభాగంలో 5,806 మంది, ఒకేషనల్ విభాగంలో 1,717 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందుకు మొత్తం 44 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9గం టల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను అనుమతించేది లేదని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సంజీవరావు తెలిపారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్, మూడు సిట్టింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు స్వచ్ఛందంగా పరీక్షలకు గైర్హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఒక విద్యార్థికి పాజిటివ్ ఉందని సంజీవరావు తెలిపారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ను సైతం అనుమతిస్తామని, వాటిపై ప్రిన్సిపాల్ సంతకం తప్పనిసరి కాదని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. అదేవిఽధగా పరీక్ష కేంద్ర వద్ద థర్మల్ స్ర్కీనింగ్, శానిటైజేషన్ చేయనున్నారు. ఇక జ్వర లక్షణాలు ఉన్న విద్యార్థుల కోసం ప్రతీ పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్ గదిని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కోసం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్కో చర్యలు తీసుకుంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటుతో పాటు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమయంలో మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నారు.