విస్తరణ పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2021-10-29T05:55:31+05:30 IST

ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ భువనగిరి పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు.

విస్తరణ పనుల్లో వేగం పెంచాలి
ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తున్న దుకాణదారులు, వ్యాపారులు

సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ పమేలాసత్పథి, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి

భువనగిరిటౌన్‌, అక్టోబరు 28: ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ భువనగిరి పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు. రహదారి విస్తరణ పనులపై గురువారం మునిసిపల్‌ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధాన రహదారి 100 అడుగుల విస్తరణకు కట్టుబడి ఉండాలని, ఎక్కడా రాజీ పడకూడదన్నారు. మార్కింగ్‌ ఆధారంగా కూల్చివేతలను పూర్తిచేసి పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించాలని ఇందుకు అధికారులు, కౌన్సిల్‌ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఉపాధి కోల్పోనున్న డబ్బా దుకాణదారులకు రెండు, మూడు రోజుల్లో ప్రత్యామ్నాయం చూపాలన్నారు. మునిసిపల్‌ యంత్రాంగం పూర్తిగా స్థల స్వాధీన పనులపైనే శ్రద్ధపెట్టాలని, ముందుగా ప్రభుత్వ భవనాల స్థలాలను స్వాధీనం చేసుకోవాలని, ఇందుకోసం వాటిలోని కట్టడాలను తొలగించాలని నిర్ణయించారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, కమిషనర్‌ ఎం.పూర్ణచందర్‌, పీఆర్‌ డీఈ గిరిధర్‌, పట్టణ ప్రణాళిక అధికారి జె.కృష్ణవేణి పాల్గొన్నారు. 


80 అడుగులకే పరిమితం చేయాలంటూ వినతులు 

పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులను 80 అడుగులకే పరిమితం చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ పమేలాసత్పథి, ఎమ్మెల్యే పైళ్లశేఖర్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. రోడ్డు విస్తరణతో వందలాది కుటుంబాలు వీధిపాలుకానున్నాయని వివరించారు.  

Updated Date - 2021-10-29T05:55:31+05:30 IST