‘థర్మల్’ ఇళ్ల కూల్చివేత ప్రారంభం
ABN , First Publish Date - 2021-06-23T06:40:25+05:30 IST
యాదాద్రి థర్మల్ విద్యుత్ పరిశ్రమ కోసం భూములు సేకరించిన గ్రామాల్లో మంగళవారం జెన్కో అధికారులు పోలీసుల సహాయంతో ఇళ్ల కూల్చివేతను చేపట్టారు.
గడువు కావాలంటూ బాధితుల ఆందోళన
దామరచర్ల, జూన్ 22 : యాదాద్రి థర్మల్ విద్యుత్ పరిశ్రమ కోసం భూములు సేకరించిన గ్రామాల్లో మంగళవారం జెన్కో అధికారులు పోలీసుల సహాయంతో ఇళ్ల కూల్చివేతను చేపట్టారు. మండలంలోని మోదుగులకుంటతండా, కపూరతండాలు పరిశ్రమ నిర్మాణంతో ఇళ్లు కోల్పోతున్న తండావాసులకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈక్రమంలో బాధితులకు గత ఏడాది ఇంటి నిర్మాణాలకు నష్టపరిహారం చెల్లించి, నివాస స్థలాన్ని అధికారులు కేటాయించారు. ఈక్రమంలో జెన్కో అధికారులు పోలీసుల సాయంతో ఇళ్ల కూల్చివేత చేపట్టారు. కొందరి ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా మరి కొందరి నిర్మాణాలు పూర్తికాలేదు. తొలుత ఖాళీ ఇళ కూల్చివేతను ప్రారంభించారు. రెండు తండాల్లో సుమారు 35 ఇళ్లను కూల్చివేశారు. మిగిలిన వారు తక్షణమే ఖాళీ చేయాలని, కూల్చివేతను కొనసాగిస్తామని అధికారులు బాధితులకు తేల్చిచెప్పారు. సర్వం కోల్పోయిన తమకు మరికొంత గడువు కావాలని బాధితులు అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఈక్రమంలో విషయం తెలుసుకొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేతావత్ శంకర్నాయక్ అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడారు. పరిశ్రమ కోసం సర్వం కోల్పోయిన బాధితులు ఇళ్లు నిర్మించుకోక ముందే కూల్చివేసి, వారిని రోడ్డున పడేయటం సరికాదన్నారు. నాలుగేండ్ల క్రితం బాధితులకు సౌకర్యాల కల్పన, ఉద్యోగం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వాటిని విస్మరించిందన్నారు. గిరిజనుల భూములు బలవంతంగా ప్రభుత్వం గుంజుకుంటోందన్నారు. ఇళ్ల నిర్మాణానికి గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు.