కోర్టు ధిక్కరణ కేసులో నిందితుడికి నెల రోజుల జైలు
ABN , First Publish Date - 2021-12-30T06:41:16+05:30 IST
కోర్టు ధిక్కరణ కేసులో ఓ నిందితుడికి నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జి సాకేత్మిత్ర బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

హుజూర్నగర్ , డిసెంబరు 29: కోర్టు ధిక్కరణ కేసులో ఓ నిందితుడికి నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జి సాకేత్మిత్ర బుధవారం ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెర్వు మండలం వేపలమాధారం గ్రామానికి చెందిన చెందిన రైతు శంభయ్యకు పెదవీడు గ్రామ రెన్యూ పరిధిలో ఎకరం భూమి ఉంది. అట్టి భూమిని సేద్యం చేసుకోనివ్వకుండా రఘునాథపాలెంకు చెందిన రహీం అడ్డుకుంటున్నాడు. దీంతో 2016లో శంభయ్య, హుజూర్నగర్ జూనియర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఆ భూమిపైకి రహీంను వెళ్లవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను దిక్క రించినందున నిందితుడు రహీంకు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.