మునిసిపాలిటీల అభివృద్ధిపై నిరంతర పర్యవేక్షణ
ABN , First Publish Date - 2021-12-31T06:16:44+05:30 IST
మునిసిపాలిటీల అభివృద్ధిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.
అదనపు కలెక్టర్లు, చైర్మన్లతో వీడియోకాన్ఫరెన్స్లో మంత్రి కేటీఆర్
భువనగిరి రూరల్, డిసెంబరు 30: మునిసిపాలిటీల అభివృద్ధిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మునిసిపల్ చైర్మన్లు, కమిషనర్లతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రగతి, స్వచ్ఛసర్వేక్షణ్-2022, వర్చువల్ ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొని ప్రజాప్రతినిధులు, అధికారులనుద్దేశించి మాట్లాడారు. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుధ్యం, పచ్చదనం, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, వెజ్, నాన్వెజ్ మార్కెట్ల ఏర్పాటు, ఇంటింటా తడి, పొడిచెత్త సేకరణ తదితర కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ఇతర రాష్ర్టాల్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులపై అవసరమైతే ప్రజాప్రతినిధులు, అధికారులకు స్టడీ టూర్ ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో గంగదేవిపల్లి గ్రామం ఒక్కటే ఆదర్శంగా ఉండేదని, ప్రస్తుతం ప్రతి పల్లె కూడా ఆదర్శంగా తయారైందన్నారు. ఇది నిరంతర కార్యక్రమమని, ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, జిల్లాలోని మునిసిపల్ చైర్మన్లు ఆంజనేయులు, శంకరయ్య, సావిత్రి, సుఽధ, విజయలక్ష్మి, కమిషనర్ పూర్ణచందర్రావు పాల్గొన్నారు.