రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడి మృతి
ABN , First Publish Date - 2021-12-25T06:46:00+05:30 IST
మండలంలోని పాతర్లపహాడ్ గ్రామ స్టేజీ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు మృతి చెందాడు.
![రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడి మృతి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122501133138/12252021011544n69.jpg)
ఆత్మకూర్(ఎస్), డిసెంబరు 24: మండలంలోని పాతర్లపహాడ్ గ్రామ స్టేజీ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బోరింగ్తండాకు చెందిన గుగులోతు మల్సూర్నాయక్(56) శుక్రవారం నూతనకల్లో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తూ తండాకు సమీపంలో రాత్రి 8.30 గంటలకు బైక్ అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్సూర్ నాయక్కు ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలానికి ఎస్ఐ యాదవేందర్రెడ్డి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి జడ్పీ వైస్చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్ చేరుకుని ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్సూర్ నాయక్ మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.