నాలుగు పరిశ్రమల యజమానులపై కేసులు
ABN , First Publish Date - 2021-01-21T06:21:35+05:30 IST
బాలలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న భువనగిరిలోని నాలుగు పరిశ్రమల యజమానులపై కేసులు నమోదు చేసి ఆరు రాష్ట్రాలకు చెందిన 26మంది బాల బాలికలకు వెట్టి నుంచి విముక్తి కల్పించినట్లు రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్ బుధవారం మీడియాకు తెలిపారు.
ఆరు రాష్ట్రాలకు చెందిన 26 మంది బాలకార్మికులకు విముక్తి
భువనగిరి టౌన్, జనవరి 20: బాలలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న భువనగిరిలోని నాలుగు పరిశ్రమల యజమానులపై కేసులు నమోదు చేసి ఆరు రాష్ట్రాలకు చెందిన 26మంది బాల బాలికలకు వెట్టి నుంచి విముక్తి కల్పించినట్లు రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్ బుధవారం మీడియాకు తెలిపారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలకార్మికుల విముక్తి కోసం రాచకొండ ఏహెచ్టీయూ పోలీసులు పలు ప్రభుత్వ శాఖల అధికారు లతో కలిసి ఆపరేషన్ స్మైల్లో భాగంగా మంగళవారం భువనగిరిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీంతో స్థానిక అర్బన్ కాలనీలోని సమోసా తయారీ కేంద్రం, పారిశ్రామిక వాడలోని ఖాళీ సీసాల వాషింగ్ కంపెనీ, మారుతీ పాలిమార్స్, ఎస్ఎస్ఆర్ ఫాం ఇండస్ర్టీలో పనిచేస్తున్న జార్ఖండ్-9, చతీస్ఘడ్-7, బీహార్-3, మధ్యప్రదేశ్ -3, పశ్చిమబెంగాల్ -1, తెలంగాణ-3 బాల కార్మికులకు విముక్తి కల్పించారు. వీరిలో 18 మంది బాలురు, 8మంది బాలికలు ఉన్నారు. విముక్తి కల్పించిన బాలకార్మికులను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాగా కేసులు నమోదైన పరిశ్రమల యజమానులు బీరం వెంకట్రెడ్డి, పంజాల వీరన్నగౌడ్, వికాస్కుమార్, రవికుమార్, గౌతమ్రెడ్డి, చల్లా బాపును అరెస్ట్ చేయగా శ్రీనివాస్రెడ్డి, నర్సింహ పరారీలో ఉన్నట్లు తెలిపారు.