బస్వాపురం ప్రాజెక్టు పనుల అడ్డగింత
ABN , First Publish Date - 2021-05-13T07:28:57+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భువనగిరి మండలం బస్వాపురం వద్ద చేపడుతున్న రిజర్వాయర్ పనులను నిర్వాసితులు బుధవారం అడ్డుకున్నారు.
భువనగిరి రూరల్, మే 12: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భువనగిరి మండలం బస్వాపురం వద్ద చేపడుతున్న రిజర్వాయర్ పనులను నిర్వాసితులు బుధవారం అడ్డుకున్నారు. దశాబ్ద కాలంగా ప్రభుత్వ భూములను సాగు చేసుకొని జీవిస్తున్నప్పటికీ ప్రాజెక్ట్ నిర్మాణంలో తమ భూములను సేకరించి పరిహారం చెల్లించ కుండా అధికారులు జాప్యం చేస్తుండడంతో రైతులు హై కోర్టు నుంచి పనులు నిలిపివేయాలని స్టేటస్కో ఉత్తర్వులు తీసుకువచ్చినప్పటికీ ప్రాజెక్ట్, కాంట్రాక్టర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను చేపడుతున్నారు. అయితే నిర్వాసిత రైతులు ఉడుత విష్ణు, ముసునూరి వెంకటేష్, నరాల చంద్రయ్య, మచ్చ శ్రీను, మల్లేశం, తదితరులు నిర్మాణ పనుల వద్దకు వెళ్లి తమకు నష్ట పరిహారం చెల్లించేవరకు పనులు నిలిపివేయాలని ప్రాజెక్ట్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి పనులను అడ్డుకున్నారు. రైతుల స్వాధీనంలో ఉండి సాగు చేసుకుంటున్న భూములకు భూ సేకరణ చట్టం–2013 ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లా నాయకులు ఏశాల అశోక్ డిమాండ్ చేశారు.