ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు : తహసీల్దార్
ABN , First Publish Date - 2021-11-28T05:56:52+05:30 IST
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ సీహెచ్.విశాలాక్ష్మి హెచ్చరించారు.

చింతపల్లి, నవంబరు 27: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ సీహెచ్.విశాలాక్ష్మి హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 154ను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శనివారం సర్వే చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గతంలో 154 సర్వేనెంబర్లో 9 ఎకరాల భూమిని సర్వేచేసి, గొట్టిముక్కల రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతులకు ఇంటి స్థలాలు ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా కిష్టరాయన్పల్లి రిజర్వాయర్ కింద భూములు కోల్పోయే నిర్వాసితుల కోసం అదే సర్వేనెంబర్లో 28 ఎకరాల 22 గుంటల భూమిని సర్వేచేసినట్లు పేర్కొన్నారు. 154 సర్వేనెంబర్లో భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. మండలంలోని ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. ఆమె వెంట డిప్యూటీ తహసీల్దార్ ఉమ, దేవరకొండ డివిజన్ డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ వంశీ, చింతపల్లి మండల సర్వేయర్ రతన్లాల్ ఉన్నారు.