ఘనంగా కూడారై ఉత్సవం

ABN , First Publish Date - 2021-01-12T06:02:00+05:30 IST

ధనుర్మాస ఉత్సవంలో భాగంగా పట్టణంలోని పలు దేవాలయాల్లో సోమవారం ఉదయం కూడారై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా కూడారై ఉత్సవం
కూడారై ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

గంగాళాల్లో పాయసంతో స్వామి, అమ్మవార్లకు నివేదన
నల్లగొండ కల్చరల్‌ / చిట్యాల రూరల్‌ / నార్కట్‌పల్లి, జనవరి 11 :
ధనుర్మాస ఉత్సవంలో భాగంగా పట్టణంలోని పలు దేవాలయాల్లో సోమవారం ఉదయం కూడారై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోదాదేవి రచించిన 29వ పాశుర ప్రవచనం పూర్తైన సందర్భంగా పండితులు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి 108 గంగాళాలు, పాయసంతో నివేదించారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వేడుకలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదా రంగనాయక స్వాములకు భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో సం దడిగా మారాయి. జిల్లాకేంద్రంలోని రామగిరిలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కూడారై ఉత్సవం కనుల పండువగా సాగింది. నల్లాన్‌ చక్రవర్తుల విష్ణుప్రియ 29వ పాశురాన్ని ప్రవచనం చేశారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, ఆర్డీవో సతీమణి సౌమ్య, కౌన్సిలర్‌ యామ కవితాదయాకర్‌ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ చకిలం వేణుగోపాల్‌రావు, మాజీ చైర్మన్‌ చకిలం సంధ్యారాణి, వికాస తరంగిణి సభ్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా వీటీకాలనీలోని శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, పానగల్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయం, షేర్‌బంగ్లాలోని సంతోషీమాత ఆలయం, బీట్‌మార్కెట్‌లోని శ్రీరామకోటి స్థూప ఆలయం, దేవరకొండ రోడ్డులో వేంకటేశ్వరుడి ఆలయాల్లో కూడారై ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిట్యాల మండలం నేరడలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ 40వ మార్గళి ఉత్సవం సందర్భంగా కూడారై ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నార్కట్‌పల్లి మండలంలోని గోపలాయపల్లి, నార్కట్‌పల్లిలోని వేణుగోపాలస్వామి దేవస్థానాల్లో కూడారై ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

Updated Date - 2021-01-12T06:02:00+05:30 IST