ఇంకా గ్రామాల్లోనే ఎందుకుంటున్నారు!

ABN , First Publish Date - 2021-05-30T05:37:46+05:30 IST

మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలైన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌, పల్లెపహాడ్‌ గ్రామాల్లో నిర్వాసితులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు.

ఇంకా గ్రామాల్లోనే ఎందుకుంటున్నారు!
పల్లెపహాడ్‌, వేములఘాట్‌ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్న అధికారులు

మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో  అధికారుల బెదిరింపులు 

భయాందోళనలో నిర్వాసితులు
తొగుట, మే 29 : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలైన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌, పల్లెపహాడ్‌ గ్రామాల్లో నిర్వాసితులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని మెజార్టీ కుటుంబాలను గజ్వేల్‌ పట్టణ సమీపంలో నిర్మించిన పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. కాగా ఇంకా కొంతమందికి ఆర్‌అండ్‌ఆర్‌తో పాటు పరిహారం అందకపోవడంతో గ్రామాల్లోనే నివాసముంటున్నారు. ఇప్పటికే నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లోనే అధికారులు సర్వే చేపట్టి అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీఇచ్చారు. కానీ ఇంతవరకూ వారి గురించి పట్టించుకోలేదు. కాగా శనివారం ఆయా గ్రామాలకు కొందరు ప్రభుత్వ అధికారులమంటూ కొందరు వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో సర్వేల పేరుతో రెవెన్యూ అధికారులమంటూ తమ ఇళ్ల వద్దకు రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికారుల పేరుతో ఇంటికి వచ్చి ఇంకా గ్రామంలోనే ఎందుకుంటున్నారు... మీకు ఇంకా ఏమి వచ్చేటివి ఉన్నాయి.. ఊరు ఖాళీ చేసి వెళ్లాలని దబాయిస్తూ మాట్లాడారని నిర్వాసితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్న ఊరు.. నమ్ముకున్న భూమి మల్లన్నసాగర్‌లో మునుగుతుంటే మమ్మల్ని ఆదుకోవాల్సిన అధికారులు ఇలా వేధింపులకు పాల్పడటం పట్ల మండిపడుతున్నారు. ఈ విషయమై సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డిని ఫోన్‌లో సంప్రదించగా గ్రామాల్లోకి ఎవరొచ్చారో తెలియదని చెప్పారు. కనుక్కొని చెబుతా అంటూ ఫోన్‌ కట్‌ చేశారు. 

Updated Date - 2021-05-30T05:37:46+05:30 IST