రేపటి నుంచి ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-02-06T06:01:15+05:30 IST
వివిధ శాఖల్లో పనిచేసే ఫ్రంట్లైన్ వర్కర్లకు సోమవారం నుంచి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.

రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీ సిబ్బందికి
సమాచారం సేకరించిన ఆరోగ్య శాఖ
9,005 మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తింపు
ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ నేటితో పూర్తి
సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 5: వివిధ శాఖల్లో పనిచేసే ఫ్రంట్లైన్ వర్కర్లకు సోమవారం నుంచి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ సేకరించింది. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, పోలీసులు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సిబ్బంది 9,005 మందికి టీకా ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సమాయత్తమైంది. గత నెల 16న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. ఈ నెల 4 వరకు 10,140 ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా 4,758 మంది సిబ్బంది మాత్రమే టీకా తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 13 నుంచి ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.