పంటకు కనీస మద్దతు ధర చట్టం చేయాలి
ABN , First Publish Date - 2021-11-29T05:05:14+05:30 IST
మూడు నల్ల చట్టాల రద్దు చేయడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య అన్నారు. సీపీఎం సిద్దిపేట జిల్లా ద్వితీయ మహాసభలు ముగింపు సమావేశానికి హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

వడ్ల కొనుగోలుపై మొండివైఖరి విడనాడాలి
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతుగా కేంద్రంపై నిజాయితీగా పోరాడాలి
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య
సిద్దిపేట అర్బన్, నవంబరు 28 : మూడు నల్ల చట్టాల రద్దు చేయడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య అన్నారు. సీపీఎం సిద్దిపేట జిల్లా ద్వితీయ మహాసభలు ముగింపు సమావేశానికి హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు నల్ల చట్టాలను రద్దు పోరాటంలో అమరులైన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కల్లాల్లో పోసుకున్న ధాన్యం వానకు తడుస్తూ ఉంటే రైతులు కన్నీరు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై వడ్ల కొనుగోలు విషయమై నిజాయితీగా పోరాటం నిర్వహించాలన్నారు. ఒక్క రోజు ధర్నాతో సమస్యలు పరిష్కారం కావని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా గాలి మాటలు మానుకోవాలని హితవు పలికారు. వడ్ల కొనుగోలుపై మొండివైఖరిని విడనాడాలన్నారు. సీపీఎం మహాసభల్లో భవిష్యత్తు పోరాట కార్యాచరణను రూపొందించామని తెలిపారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, అసంఘటిత రంగ కార్మికులకు న్యాయం చేయాలని, అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని, 22 శాతం ఉన్న దళితుల అభివృద్ధికి బాటలు వేయాలని, మహిళల సమస్యలను పరిష్కరించాలని మహాసభలో భవిష్యత్ పోరాటాలకు తీర్మానం చేసినట్లు తెలిపారు. కార్మిక, రైతాంగ, ప్రజల సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో భవిష్యత్తులో మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కా రాములు, రాష్ట్ర కమిటీ సభ్యుడు రమా, జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యుడు గోపాలస్వామి, కళావతి, నాయకులు శశిధర్, యాదగిరి, ఎల్లయ్య, భాస్కర్, రవి తదితరులు పాల్గొన్నారు.