లేగదూడలను చంపింది చిరుతపులే

ABN , First Publish Date - 2021-05-06T05:11:45+05:30 IST

మండలంలోని నాగ్‌ధర్‌ గ్రామ శివారుకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతం నుంచి గుర్తు తెలియని జంతువు సమీప వ్యవసాయ భూముల వద్ద నుంచి లేగదూడల్ని తీసుకెళ్లి తింటున్నది.

లేగదూడలను చంపింది చిరుతపులే

నిర్ధారించిన నాగ్‌ధర్‌ గ్రామ రైతులు

అర్ధరాత్రి మాటు వేసి చిరుతను బెదరగొట్టిన స్థానికులు

కల్హేర్‌, మే 5: మండలంలోని నాగ్‌ధర్‌ గ్రామ శివారుకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతం నుంచి గుర్తు తెలియని జంతువు సమీప వ్యవసాయ భూముల వద్ద నుంచి లేగదూడల్ని తీసుకెళ్లి తింటున్నది.  నాలుగు రోజుల తేడాతో గ్రామానికి చెందిన నాయకుని కిష్టయ్య, నాయకుని నర్సింహులుకు చెందిన రెండు లేగదూడలు రాత్రి వేళల్లో మాయం అవుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లేగదూడల్ని హైనానా లేదా చిరుతపులి తింటుందా అని హైరానా పడుతున్న రైతులు మంగళవారం రాత్రి మాటు వేసి ఉండగా లేగదూడలను ఉంచిన ప్రాంతానికి చిరుతపులి చేరుకోవడంతో రైతులు దాన్ని బెదరగొట్టి తరమివేశారు. దీంతో రెండు లేగదూడలను అపహరించి తిన్నది చిరుతనే అని తేలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతానికి ఆనుకుని తమ వ్యవసాయ భూములు ఉండడంతో తాము ఎప్పటికీ ఇక్కడికి వచ్చి వెళ్తుంటామని, ఎప్పుడూ చిరుత వచ్చి తమపై దాడి చేస్తుందోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిస్తే ప్రస్తుతం చిరుతపులి కాలి ముద్రలు గుర్తించలేమని, అదే వర్షాకాలంలో అయితే పసిగట్టి పట్టుకోవచ్చునని తెలిపినట్లు రైతులు తెలిపారు. చిరుత సంచరిస్తున్నదని నిర్ధారణ కావడంతో అటవీ ప్రాంతం సరిహద్దు ఉన్న నాగ్‌ధర్‌, రాపర్తి, మీర్‌ఖాన్‌పేట్‌, బాచేపల్లి, క్రిష్ణాపూర్‌, ఖానాపూర్‌(కె), మునిగేపల్లి, పోశెట్టిపల్లి, సిర్గాపూర్‌ మండలంలోని కడ్పల్‌, ఖాజాపూర్‌, నారాయణఖేడ్‌ మండలంలోని సంజీవన్‌రావ్‌పేట్‌, తుర్కపల్లి, నిజాంపేట తదితర గ్రామాల ప్రజలు, రైతులు, రహదారులపై ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


Updated Date - 2021-05-06T05:11:45+05:30 IST