వర్షార్పణం
ABN , First Publish Date - 2021-05-17T05:35:52+05:30 IST
అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. అమ్మకానికి తెచ్చిన ధాన్యం కళ్లముందే తడిసి ముద్దవ్వడంతో బోరున విలపించారు. వాననీళ్ల ప్రవాహంలో వడ్లన్నీ కొట్టుకుపోతుంటే రైతుల గుండెలు చెరువయ్యాయి. అష్టకష్టాలు పడి ఎండబెట్టిన ధాన్యమంతా నీటికి నానడంతో తల్లడిల్లిపోయారు. నేడో, రేపో కొనుగోళ్లు జరిగి చేతిలో డబ్బు పడే సమయాన ఈ విపత్కర పరిస్థితి తలెత్తడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. తేమ సాకుతో తమను రోజుల తరబడి మార్కెట్లలో, ఐకేపీ కేంద్రాల్లో ఎదురుచూసేలా ఉంచారని రైతులు ఆరోపిస్తున్నారు.
అకాల వర్షానికి తడిసిన ధాన్యం
కొనుగోలు కేంద్రాల్లో బోరుమన్న రైతన్న
వందలాది క్వింటాళ్ల ధాన్యం నీళ్లపాలు
సిద్దిపేట మార్కెట్లో వరదపాలైన వడ్లు
చెరువులోకి కొట్టుకెళ్లిన ధాన్యం
కొంపముంచిన ‘తేమ’ సాకు
అప్రమత్తమయ్యేలోపే ఆగమాగం
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 16 : అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. అమ్మకానికి తెచ్చిన ధాన్యం కళ్లముందే తడిసి ముద్దవ్వడంతో బోరున విలపించారు. వాననీళ్ల ప్రవాహంలో వడ్లన్నీ కొట్టుకుపోతుంటే రైతుల గుండెలు చెరువయ్యాయి. అష్టకష్టాలు పడి ఎండబెట్టిన ధాన్యమంతా నీటికి నానడంతో తల్లడిల్లిపోయారు. నేడో, రేపో కొనుగోళ్లు జరిగి చేతిలో డబ్బు పడే సమయాన ఈ విపత్కర పరిస్థితి తలెత్తడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. తేమ సాకుతో తమను రోజుల తరబడి మార్కెట్లలో, ఐకేపీ కేంద్రాల్లో ఎదురుచూసేలా ఉంచారని రైతులు ఆరోపిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలోని పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటిదాకా ఎండవేడిమితో ఉన్న వాతావరణమంతా ఒక్కసారిగా జలమయమైంది. గడిచిన ఐదు నెలల్లో ఇలాంటి వర్షం పడలేదు.
తడిసిముద్దయిన ధాన్యం
వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ కేంద్రాలకు అమ్మకం కోసం తెచ్చిన వరిధాన్యమంతా వర్షార్పణమైంది. హఠాత్తుగా వర్షం రావడంతో రైతులు అప్రమత్తం కాలేకపోయారు. టార్ఫాలిన్లు తెచ్చి ధాన్యాన్ని రక్షించుకునే సమయం కూడా లేకపోయింది. అప్పటికే ఒక ఉదుటున పడ్డ వర్షానికి ధాన్యం ఏరుల్లా కొట్టుకుపోయింది. సిద్దిపేట అర్బన్, గజ్వేల్, తొగుట, చేర్యాల, మిరుదొడ్డి, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, రాయపోల్ మండలాల్లోని మార్కెట్లు, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యమంతా తడిసింది. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో వరదకు ధాన్యం నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే రైతులంతా నిస్సహాయులుగా మారిపోయారు.
అప్రమత్తత ఏదీ?
తుఫాను ప్రభావం ఉంటుందని హెచ్చరికలు ఉన్నా స్థానిక అధికారులు, మార్కెట్ నిర్వాహకులు, ఐకేపీ కేంద్రాల సిబ్బంది రైతులను అప్రమత్తం చేయలేదు. దీనికి తోడు తేమ శాతం సాకుతో కొనుగోళ్లు చేయకుండా ధాన్యాన్ని అక్కడే ఉంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోజుల తరబడిగా ఉంటున్నా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు చెబుతున్నారు. తీరా కొనుగోలు చేసే క్రమంలో వర్షానికి అంతా తడిసిముద్దయిందని వాపోతున్నారు. ముందస్తుగా రైతులను అప్రమత్తం చేసి ఉంటే ఇంతటి పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు.
వడ్లన్నీ కొట్టుకుపోయాయి
సిద్దిపేట మార్కెట్కు నాలుగు ట్రాక్టర్ల వడ్లు తెచ్చినం. తేమ ఉన్నదని పదిరోజుల నుంచి ఇక్కడనే ఎండబెట్టిచ్చిండ్రు. మంచిగా ఎండినాయి. ఇగ కొంటాం, అగ కొంటాం అంటూ ఆపిండ్రు. ఇప్పుడు పిడుగు పడ్డట్టే వాన కొట్టింది. నేను తెచ్చిన వడ్లన్నీ నీళ్లకు కొట్టుకుపోయాయి. మా బాధ ఎవ్వరికి తెలుస్తది. మళ్లా వడ్లన్నీ ఏరి కుప్పపోసి అమ్మాలంటే ఎన్ని రోజులు పడ్తదో. పది రోజులు ఎండబెడితేనే తేమ ఉన్నదన్నోళ్లు.. ఈ తడిసిన ధాన్యానికి ఎన్ని వంకలు చెబుతారో.
- సుగుణ, రైతు, ఇమాంబాద్
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో..
జిన్నారం/నారాయణఖేడ్/హవేళీఘణపూర్, మే 16 : సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది. జిన్నారం మండలంలో ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం విరుచుకుపడింది. జిన్నారం సహ అన్ని గ్రామాల్లో గంట పాటు కురిసిన వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జిన్నారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న బస్తాలపై నిర్వాహకులు టార్పాలిన్లను కప్పారు. కొందరు రైతుల బస్తాలు వర్షంలో తడిశాయి. నారాయణఖేడ్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులతోపాటు ఓ మోస్తరుగా వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై ఉండి వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో పలుచోట్ల మామిడి కాత నేలరాలింది. వర్షానికి తడిసిన వరిధాన్యం మెదక్ జిల్లాలోని హవేళీఘణపూర్ మండలంలో ఆదివారం సాయంత్రం గాలివాన పడగా పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం, బస్తాలు తడిసిపోయాయి.