ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2021-07-25T04:18:00+05:30 IST
: రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు పుట్టిన రోజు వేడుకలను శనివారం సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ముక్కోటి అర్చనలో భాగంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు.

మొక్కలు నాటిన ప్రజా ప్రతినిధులు
పటాన్చెరు/జిన్నారం/రామచంద్రాపురం/హత్నూర/వట్పల్లి/మునిపల్లి/జోగిపేట/సంగారెడ్డి టౌన్/సదాశివపేట/నారాయణఖేడ్/జహీరాబాద్, జూలై 24: రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు పుట్టిన రోజు వేడుకలను శనివారం సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ముక్కోటి అర్చనలో భాగంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. అనంతరం కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. శనివారం మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పటాన్చెరులోని దర్గా, ఎల్లంకి కళాశాలకు వెళ్లే దారిలో శాసనమండలి చైర్మన్ భూపాల్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ భానూప్రకాష్ ఆధ్వర్యంలో 15 వేల మొక్కలు నాటారు. జిన్నారం మండలం జంగంపేట, శివానగర్లో, భారతీనగర్, రామచంద్రాపురం డివిజన్లలో కార్పొరేటర్లు సింధూఆదర్శరెడ్డి, పుష్పనగేష్, డీసీ బాలయ్యతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మొక్కలు నాటారు. అమీన్పూర్లో మున్సిపల్ చైర్మన్ తుమ్మలపాండురంగారెడ్డి గాంధీ చౌక్ నుంచి లాలాబాయి కాలనీ వరకు రెండువేల మొక్కలు నాటారు. హత్నూర, దేవులపల్లిలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి మొక్కలు నాటారు. వట్పల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో, మునిపల్లిలోని పెద్దచెరువు పక్కన, బుదేరా, గోప్లారం, కంకోల్లో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జోగిపేటలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మొక్కలు నాటారు. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. సదాశివపేటలో మొక్కలు నాటారు. ఖేడ్ పట్టణ శివారులోని అర్బన్ పార్కులో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఐదు వేల మొక్కలు నాటారు. జహీరాబాద్ డివిజన్లో ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీమంత్రి ఫరీదుద్దీన్ మొక్కలు నాటారు.
మెదక్ జిల్లాలో
నర్సాపూర్/మెదక్/రామాయంపేట/తూప్రాన్ (మనోహరాబాద్)/కౌడిపల్లి, జూలై 24: కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నర్సాపూర్లోని క్యాంపు కార్యాలయంలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి కేక్ను కట్ చేశారు. ఎల్లాపూర్లో మొక్కలు నాటారు. మెదక్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవెందర్రెడ్డి కేక్ను కట్ చేశారు. మెదక్, రామాయంపేటలో మొక్కలు నాటారు. మనోహరాబాద్ మండలం దండుపల్లి, కోనాయపల్లి (పీటీ), రంగాయపల్లిలలో జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ మొక్కలు నాటారు. కౌడిపల్లి మండలంలోని మినీ ట్యాంక్ బండ్పై ఎమ్మెల్యే మదన్రెడ్డి మొక్కలు నాటరు. కాగా చిన్నశంకరంపేట, రేగోడు, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, హవేళీఘణపూర్, నిజాంపేట, పాపన్నపేట, టేక్మాల్, చిల్పచెడ్, చేగుంట, వెల్దుర్తి, తూప్రాన్ మండలాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు మొక్కలు నాటారు. కేక్ను కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
పుచ్చకాయపై కేటీఆర్, కేసీఆర్ చిత్రపటాలు
వట్పల్లి, జూలై 24 : కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ అభిమాని పుచ్చకాయ (వాటర్ మిలన్)పై కేటీఆర్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రాలను చిత్రీకరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అలాగే వివిధ పండ్లతో చిత్రాలను అలంకరించి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.