కవులు సమస్యల మూలాల్లోకి వెళ్లాలి
ABN , First Publish Date - 2021-10-18T04:27:43+05:30 IST
కవులు, రచయితలు సమస్యల మూలాల్లోకి వెళ్లి సహేతుకమైన కారణాలను విశ్లేషించినప్పుడే సాంద్రత కలిగిన కవిత్వం వెలువడుతుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి అన్నారు.
ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి
సిద్దిపేట, అక్టోబరు 17 : కవులు, రచయితలు సమస్యల మూలాల్లోకి వెళ్లి సహేతుకమైన కారణాలను విశ్లేషించినప్పుడే సాంద్రత కలిగిన కవిత్వం వెలువడుతుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి అన్నారు. వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక ప్రెస్క్లబ్లో కవయిత్రి ఉప్పలపద్మ రచించిన ‘రెక్కతొడిగిన వాక్యం’ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సమావేశానికి సంగమం అధ్యక్షుడు కొండిమల్లారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ కవిత్వాన్ని రాయటమే కాదు, వాటిని ముద్రించి భద్రపరచడం సాహిత్యకారులు బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఇవే భావితరాలకు చరిత్రగా మిగిలిపోతాయన్నారు. భావజాల వ్యాప్తికి ఉపయోగపడుతాయని తెలిపారు. కవులు, రచయితలు, రాజకీయ ఆర్థిక శాస్త్రాలను అవగాహన చేసుకోగలిగితే, మరింత చిక్కనైన కవిత్వాన్ని సృష్టించవచ్చని సూచించారు. సామాజిక స్పృహ కలిగిన రచనలే శాశ్వతంగా నిలబడతాయని చెప్పారు. సృజనకారులు ఇది గుర్తెరిగి రచనావ్యాసంగాలను కొనసాగించాలన్నారు. కవిత్వాన్ని సామాజిక బాధ్యతగా భావించి, ప్రచురణ బాధ్యతల్ని భుజానికెత్తుకున్న వెన్నెల సాహితీని అభినందించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా కొమురవెల్లి అంజయ్య, తిరుపతిరెడ్డి, వెన్నెల సాహితీబాధ్యులు రామచంద్రారావు, మహమూద్ పాషా, పర్కపెల్లి యాదగిరి, వంగర నరసింహారెడ్డి, పద్మ, మహేందర్రెడ్డి, తలారి మహిపాల్, మహేందర్, ఉమాశంకర్, సుధాకర్, రాజు, ప్రభాకర్, వసంత, శ్రీనివాస్, రాజ్కుమార్, రాజేశం, పరశురాములు, లక్ష్మయ్య పాల్గొన్నారు.