‘ప్రగతి’కి దూరంగా చౌటాగ్ తండా?
ABN , First Publish Date - 2021-07-28T04:27:23+05:30 IST
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమానికి మండలంలోని మాందాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చౌటాగ్ గిరిజన తండాను అధికారులు పక్కన పెట్టారు. జూలై 1 నుంచి పది రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో ఈ తండాలో ఎలాంటి పనులు చేపట్టలేదు. దీంతో సమస్యలు మరింత ఎక్కువయ్యాయని తండావాసులు వాపోతున్నారు.
అధికారులపై కలెక్టర్ ఆగ్రహించినా మారని తీరు
మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి 20 రోజులైనా పట్టించుకోని వైనం
అల్లాదుర్గం, జూలై 27: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమానికి మండలంలోని మాందాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చౌటాగ్ గిరిజన తండాను అధికారులు పక్కన పెట్టారు. జూలై 1 నుంచి పది రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో ఈ తండాలో ఎలాంటి పనులు చేపట్టలేదు. దీంతో సమస్యలు మరింత ఎక్కువయ్యాయని తండావాసులు వాపోతున్నారు. అయితే అధికారులు ఒకరోజు తండాను సందర్శించి పాఠశాల ఎదుట తూతూమంత్రంగా పిచ్చిమొక్కలను తొలగించి, ఫొటోలను మాత్రం తీసుకు వెళ్లినట్టు తండావాసులు చెప్పారు. ఈ నెల 9న జిల్లా కలెక్టర్ హరీశ్ మండలంలో పర్యటించి అధికారుల పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో మండలాన్ని మరోమారు సందర్శిస్తానని, పనుల్లో పుురోగతి లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించినా అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తయి దాదాపు పక్షం రోజులు గడిచినా తండా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు.
సమస్యల వలయంలో...
చౌటాగ్ గిరిజన తండాలోని గృహాల చుట్టూ పిచ్చిమొక్కలు పేరుకుపోయి పారిశుధ్యం లోపించింది. దీంతో దోమల బెడదతో పాటు విష సర్పాల భయం కూడా తీవ్రంగా ఉందని తండావాసులు వివరించారు. భగీరథ నీటి పైపులు పగిలి దాదాపు 20 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని వాపోయారు. దీంతో తండాలోని ఒకే బోరు తాగునీటికి దిక్కయ్యింది. అది కూడా విద్యుత్ సరఫరా ఉంటేనే తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరికే పరిస్థితి నెలకొందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా తండాకు వచ్చే ప్రధాన రహదారి పక్కన ఉన్న పిచ్చిమొక్కలు రోడ్డును కప్పేస్తున్నాయని, దీంతో పరిసరాలు ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి తండాలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో తాగునీటికి దూరం : దేవసోత్ లక్ష్మీ రాథోడ్
అధికారుల నిర్లక్ష్యంతో మేము స్వచ్ఛమైన తాగు నీటికి దూరం కావలసి వచ్చింది. భగీరథ పైపులు పగిలినా, అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంలో తాగు నీరు నిలిచిపోయింది. దీంతో తండాలో ఉన్న ఒక్క తాగు నీటి బోరే శరణ్యమైంది. విద్యుత్ సరఫరా ఉంటేనే గుక్కెడు మంచినీరు దొరుకుతుంది.