టెస్టులు లేవు.. టీకాలు వేయలేదు
ABN , First Publish Date - 2021-05-10T05:44:35+05:30 IST
కొవిడ్ తీవ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆదివారం సంగారెడ్డి జిల్లాలో ఎవరికి టెస్టులు నిర్వహించలేదు. టీకాలు ఇవ్వలేదు. కొవిడ్ లక్షణాలను గుర్తించేందుకు ప్రతి పీహెచ్సీకి 25 ర్యాట్ కిట్లను ఇస్తున్న ప్రభుత్వం వాటి కొరత ఏర్పడినందునే ఆదివారం టెస్టులను నిర్వహించొద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.
ఆదివారం మూతపడిన పీహెచ్సీలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మే 9 : కొవిడ్ తీవ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆదివారం సంగారెడ్డి జిల్లాలో ఎవరికి టెస్టులు నిర్వహించలేదు. టీకాలు ఇవ్వలేదు. కొవిడ్ లక్షణాలను గుర్తించేందుకు ప్రతి పీహెచ్సీకి 25 ర్యాట్ కిట్లను ఇస్తున్న ప్రభుత్వం వాటి కొరత ఏర్పడినందునే ఆదివారం టెస్టులను నిర్వహించొద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అలాగే రెండో డోసు టీకాకు శనివారం నుంచి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం దానిని కూడా ఆదివారం నిలిపివేసింది. ఇప్పటికే కొవాగ్జిన్ రెండో డోసు టీకా కోసం వేల సంఖ్యలో ప్రజలు నిరీక్షిస్తున్నారు. కొవాగ్జిన్ టీకా లక్ష్యం మేరకు సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కొవాగ్జిన్ టీకాను మొదటి డోసు తీసుకున్న 22 రోజుల నుంచి 45 రోజుల లోపు రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొవాగ్జిన్ కొరత కారణంగా గడువు తీరిన తర్వాత రెండో డోసు టీకా వేయించుకున్నా ఇబ్బంది ఏమీ ఉండదని ఆ వర్గాలు వివరించాయి. కొవిషీల్డ్ టీకా కూడా రెండో డోసు వేసేందుకు జిల్లా అవసరాల మేరకు సరఫరా కావడం లేదని ఆ వర్గాలు తెలిపాయి. అందుకే ఆదివారం నిలిపివేశామని ఆ వర్గాలు వివరించాయి. టీకా, టెస్టులను నిలిపివేయడంతో జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్ని ఆదివారం మూత పడ్డాయి.