విద్యార్థులు 1,720 మంది.. లెక్చరర్లు ముగ్గురు!
ABN , First Publish Date - 2021-11-01T04:55:43+05:30 IST
మెదక్ అర్బన్, అక్టోబరు 31: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బోధకుల కొరత వేధిస్తున్నది. రెగ్యులర్ లెక్టరర్లు లేక కాంట్రాక్ట్ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. అధ్యాపకులు లేక చదువులు అటకెక్కుతున్నాయి. మెదక్ జిల్లాలో సర్కారు కళాశాలలు ఉన్నదే తక్కువ.. ఉన్నవాటిలో అతిపెద్దదైన మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు
28 పోస్టులకు 25 ఖాళీలు
విధులు నిర్వహిస్తున్న 19 మంది కాంట్రాక్టు లెక్చరర్లు
అడ్మిషన్లు భారీగా పెరిగినా పట్టించుకోని సర్కారు
అరకొర చదువులతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
మెదక్ అర్బన్, అక్టోబరు 31: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బోధకుల కొరత వేధిస్తున్నది. రెగ్యులర్ లెక్టరర్లు లేక కాంట్రాక్ట్ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. అధ్యాపకులు లేక చదువులు అటకెక్కుతున్నాయి. మెదక్ జిల్లాలో సర్కారు కళాశాలలు ఉన్నదే తక్కువ.. ఉన్నవాటిలో అతిపెద్దదైన మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నాణమైన విద్య అందడంలేదు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్నికోర్సుల్లో కలిపి మొత్తం 1,720 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈ కళాశాలకు ఏడాది ఫిబ్రవరిలో న్యాక్ బి–గ్రేడ్ గుర్తింపు లభించింది. ఈ కళాశాలలో మొత్తం 28 రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ముగ్గురు రెగ్యులర్ అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. ఇద్దరు ఎకనామిక్స్, ఒకరు బోటనీ లెక్చరర్ ఉన్నారు. వీరిలో ఒకరు ఇన్చార్జి ప్రిన్సిపాల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 19 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఇంగ్లిష్, హిస్టరీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల రెగ్యులర్ అధ్యాపకులు డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తుండేవారు. సెప్టెంబర్ 30న వారిని సొంత స్థానాలకు బదిలీ చేశారు. అధ్యాపకులు లేక తరగతులు సక్రమంగా సాగడంలేదు. దీంతో కాలేజీలో చదివే పేద, గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు, విషయ నైపుణ్యాలపై తీవ్ర ప్రభావం పడుతున్నది.
అధ్యాపకుల భర్తీ ఎప్పుడో?
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి చివరిసారిగా 2012లో నోటిఫికేషన్ వెలువడింది. ఏళ్ల తరబడి పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య అదేస్థాయిలో పెరుగుతున్నది. దీంతో ఉన్నతవిద్య ప్రశ్నార్థకంగా మారుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డిగ్రీ కళాశాలలో ఖాళీలను భర్తీచేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.