పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు
ABN , First Publish Date - 2021-12-10T05:07:45+05:30 IST
ఉమ్మడి మెదక్ జిల్లా శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్ వెల్లడించారు.

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్/సంగారెడ్డి అర్బన్, డిసెంబరు 9: ఉమ్మడి మెదక్ జిల్లా శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. మెదక్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో కవరేజీ ఉంటుందన్నారు. పోలింగ్ తరువాత బ్యాలెట్ బాక్సులను మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్ రూంలో భద్రపరుస్తామన్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు తమ వెంట ఫొటో గుర్తింపు కార్డులను తీసుకురావడం తప్పనిసరి అని చెప్పారు. కాగా కలెక్టర్ హరీశ్ ప్రెస్మీట్లో మాస్కు ధరించకుండా సమావేశాన్ని నిర్వహించడం పలువిమర్శలకు తావిచ్చింది. కొవిడ్ నేపథ్యంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారి ఇలా చేశారేంటని పలువురు విమర్శించారు. అదేవిధంగా సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని గురువారం రాత్రి సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. జిల్లాలో నాలుగు కేంద్రాలను ఏర్పాటుచేశామని వివరించారు.