సహనం కోల్పోయి కేంద్రంపై సీఎం అసత్యపు ఆరోపణలు
ABN , First Publish Date - 2021-12-20T05:26:14+05:30 IST
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి అనంతరం సహనం కోల్పోయిన సీఎం కేసీఆర్
![సహనం కోల్పోయి కేంద్రంపై సీఎం అసత్యపు ఆరోపణలు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921121911544261/12192021235606n95.jpg)
హుజూరాబాద్ ప్రజలు న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపించారు
ఎమ్మెల్యే ఈటల రాజేందర్
వెల్దుర్తి, డిసెంబరు 19: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి అనంతరం సహనం కోల్పోయిన సీఎం కేసీఆర్ బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం వెల్దుర్తి మండలంలో పర్యటించిన ఈటల రాజేందర్ను స్థానిక బీజేపీ, ముదిరాజ్ సంఘాల నాయకులు వేర్వేరుగా స్వాగతం పలికి శాలువాలు పూలమాలలో సత్కరించారు. మొదట ఎమ్మెల్యే ఈటల మండలంలో ప్రసిద్ధిగాంచిన నెల్లూరు పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వెల్దుర్తిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ముదిరాజ్ కులస్తులు ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. అలాగే వెల్దుర్తి, రామాయంపేట, కలాన్శెట్టిపల్లిలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. కలాన్శెట్టిపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మంగళపర్తి, అందుగులపల్లి, రామయపల్లి, మానేపల్లి, శెట్టిపల్లి, గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల జీవోలను ఇచ్చినప్పటికీ ప్రజలు ధర్యాన్ని, న్యాయాన్ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని గుర్తుచేశారు. తాను గెలవాలని తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల వారు మొక్కుకున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సహనం కోల్పోయేలా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. పదే పదే ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నాయకులపై దాడులు చేయాలనడం అసహన ఓటమికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీపై దాడి చేసేంత శక్తి లేదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బీజేపీలో చేరికలను అడ్డుకోలేరన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్మన్ ఉమ, నాయకులు గోపి, రఘువీరా రెడ్డి, రామ్మోహన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ లక్ష్మీ, నరసింహులు, జనార్దన్రెడ్డి, తిరుపతిరెడ్డి, సురేష్, రమేష్, శేఖర్ గౌడ్, ముదిరాజ్ సంఘం నాయకులు, తోట నర్సింలు, వెంకటేశం, మైసయ్య, నర్సింలు, పోచయ్యలు పాల్గొన్నారు.
ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న కేసీఆర్
పాపన్నపేట: ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వాసాన్ని కోల్పోతున్నాడని బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆదివారం ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు మెదక్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో, పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్ ఎమ్మెల్యే రాజేందర్ను ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యకర్తలు ఊరేగింపుగా ముదిరాజ్ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సభా స్థలానికి తీసుకెళ్లారు. పార్టీలకతీతంగా తరలివచ్చిన ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, రైతుల సమస్యలు పట్టించుకోని కేసీఆర్ కేంద్రంపై లేని పోని ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రం సాధించిన తర్వాత రైతులకు 24గంటల విద్యుత్, కాళేశ్వరం నీళ్లు, నూతన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తెలంగాణ ప్రాంతమంతా మాగాని చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వరిపంట వేయొద్దని అనడం హాస్యాస్పదమన్నారు. వన దుర్గామాత దర్శనం తనకు ఎంతో సంతృప్తిని కల్గించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బైండ్ల సత్యనారాయణ, బీజేపీ మండల అధ్యక్షుడు బి.రాములు, జిల్లా నాయకులు సంతో్షచారి, ముదిరాజ్ సంఘం నాయకులు కిష్టయ్య, దుర్గయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.