ప్రమాదకరంగా కిష్టాపూర్ డ్యాం
ABN , First Publish Date - 2021-04-16T05:38:52+05:30 IST
మండుటెండల్లో హల్దీవాగులో గోదావరి జలాలు ప్రవహిస్తుండడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తుండగా కొన్ని గ్రామాల ప్రజలకు మాత్రం ఇబ్బందులను కలుగజేస్తున్నాయి.
మునిగిన కాజువే వంతెన
రోడ్డుపై నుంచి ఉధృతంగా పారుతున్న వరద నీళ్లు
గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
వరదలో చిక్కుకున్న యువకులు
కొట్టుకుపోతున్న వాహనాలు
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 15 : మండుటెండల్లో హల్దీవాగులో గోదావరి జలాలు ప్రవహిస్తుండడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తుండగా కొన్ని గ్రామాల ప్రజలకు మాత్రం ఇబ్బందులను కలుగజేస్తున్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కిష్టాపూర్ చెక్డ్యాం వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. వరద నీళ్లతో కాజువే వంతెన పూర్తిగా మునిగిపోయి కిష్టాపూర్, వెంకటాయపల్లి, నర్సంపల్లి గ్రామాలకు ఐదు రోజుల నుంచి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. తూప్రాన్కు రావడానికి ఈ గ్రామాల ప్రజలు ఇటు ఇస్లాంపూర్, అటు నాచారం నుంచి చుట్టూ తిరిగి రావలసి వస్తోంది. చెక్డ్యాం వద్ద పొంగి ప్రవహిస్తున్న వరద నీళ్లను చూసేందుకు ప్రతిరోజూ జనాలు వచ్చి ఆనందపడిపోతుండగా మరొకొందరు వాహనాలపై వరదనీళ్లల్లో నుంచి వెళుతూ సాహసం చేయబోయి అదుపుతప్పి కొట్టుకుపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. గురువారం వెంకటాయపల్లి, కిష్టాపూర్ గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు బైకులపై వరదలో నుంచి వెళుతుండగా బైకులతో సహా నీళ్లల్లో కొట్టుకుపోయారు. అక్కడున్న వారు వెంటనే తమ చొక్కాలను విప్పి వారిని కాపాడి, బైకును బయటకు తీశారు. ఓ కారు కూడ వరదలో రోడ్డు మధ్యలో చిక్కుకోగా అక్కడున్న వారు ఒడ్డుకు చేర్చారు. కాజువే వంతెన పైన నాలుగు అడుగుల మేర వరద నీళ్లు ప్రవహిస్తున్నాయి. వంతెన కింద ఉన్న నీళ్లు వెళ్లే తూములు కొట్టుకువచ్చిన కలపమొద్దులు, చెత్తాచెదారంతో మూసుకుపోవడంతో కాజువేపైన వరద ప్రవాహం పెరిగింది. ఐదారు రోజుల నుంచి పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. ఈ పరిస్థితులు ఇంకెన్నాలుంటుందో అర్థం కావడం లేదు. ఆబోతుపల్లి చెక్డ్యాం కాజువే వంతెన వద్ద కూడ ప్రమాదకరస్థాయిలో వరదనీళ్లు ప్రవహిస్తున్నాయి. వెంకరత్నాపూర్ శివారులో వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు వరదనీళ్ల కారణంగా మరోసారి నిలిచిపోయాయి. అక్కడ కూడ కొన్ని నిర్మాణ సామగ్రి నీళ్లల్లో కొట్టుకుపోయాయి. కిష్టాపూర్ చెక్డ్యాం నిండినప్పుడల్లా ఇలాంటి అవస్థలు తప్పడంలేదు. వంతేన మునిగిపోవడం, రాకపోకలు ఆగిపోవడం సర్వసాధారణమైపోయింది. అధికారులు స్పందించి వంతెన ఎత్తును పెంచి నిర్మిస్తే తమ ఇబ్బందులు తప్పుతాయని ప్రజలు కోరుతున్నారు.