ఆలయాల్లో కార్తీక సందడి
ABN , First Publish Date - 2021-11-22T04:38:17+05:30 IST
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో కార్తీకమాస సందడి కొనసాగింది

కొమురవెల్లి, నాచగిరి, విద్యాధరి క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
చేర్యాల, నవంబరు 21 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో కార్తీకమాస సందడి కొనసాగింది. స్వామివారి దర్శనం కోసం పొరుగు జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోనాలు నివేదించి పట్నాలు రచించి మొక్కులు చెల్లించుకున్నారు. గంగిరేగుచెట్టుకు ముడుపులు కట్టారు.
గంగిరేగుచెట్టు ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవో బాలాజీశర్మ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఉద్యోగులు శ్రీనివాస్, జగదీశ్వర్, వెంకటచా రారి, నర్సింహులు పర్యవేక్షించారు.
నాచగిరి, విద్యాధరి క్షేత్రాల్లో
వర్గల్ : వర్గల్ మండలంలోని నాచారం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, వర్గల్ విద్యాధరి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. నాచగిరి క్షేత్రంలో కార్తీక మా సం సందర్భంగా మండపంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. వేద పండితులు రెండు పర్యాయాలు సత్యదేవుడి వత్రాలు చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ హన్మంతరావు పర్యవేక్షనలో కార్యక్రమాలు నిర్వహించగా ఆలయ కార్యనిర్వహణాధికారి కట్ట సుధాకర్రెడ్డి నేతృత్వంలో పూజా కార్యక్రమాలు చేశారు. మండలంలోని వర్గల్ విద్యాధరి క్షేత్రాన్ని భక్తులు అధికంగా దర్శించుకున్నారు. విద్యాసరస్వతీ అమ్మవారి దర్శనంతో పాటు క్షేత్రంలోని లక్ష్మీగణపతి, స్వయంభు శంభులింగేశ్వరాల యం, కల్యాణ వేంకటేశ్వరాలయం, సుబ్రహ్మణేశ్వరాలయాలను దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ భోజన వసతిని ఏర్పాటు చేసింది.
