కేంద్రం తీరుతో మరో చేనేత ఉద్యమం తప్పదు
ABN , First Publish Date - 2021-12-30T19:54:35+05:30 IST
పెంచిన జీఎస్టీ రద్దు కోసం చేనేత కార్మికులు కేంద్రంపై మరో ఉద్యమం చెయ్యాల్సి వస్తుందని, సిద్దిపేట ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, చేనేతసంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు.

సిద్దిపేట టౌన్, డిసెంబరు 29: పెంచిన జీఎస్టీ రద్దు కోసం చేనేత కార్మికులు కేంద్రంపై మరో ఉద్యమం చెయ్యాల్సి వస్తుందని, సిద్దిపేట ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, చేనేతసంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి హరీశ్రావు నివాసంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వా లు చేనేత కార్మికుల పట్ల వివక్షత చూపాయ న్నారు. దీంతో పరిశ్రమ కుదేలై చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.
చేనేత కార్మికుల గోస చూడలేకే సీఎం కేసీఆర్ అప్పట్లోనే తెలంగాణ ఉద్యమం చేపట్టారని తెలిపారు. చేనేత కార్మికుల భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. అయితే చేనేత కార్మికులపై కేంద్రం అదనపు భారం మోపడడం సరికాదన్నారు. ప్రస్తుతం చేనేత వస్త్రాలపై జీఎస్టీ 12శాతం పెంచడం సరికాదన్నారు. ఈ నిర్ణయం చేనేత రంగ కార్మికులకు ఇబ్బందిగా మారుతుందన్నారు. కేంద్రం వెంటనే చేనేతపై జీఎస్టీ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మల్లికార్జున్, మాజీ కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, నాయకులు మేర సత్తన్న, అడ్డగట్ల శేఖర్, కాముని రాజేశం తదితరులు పాల్గొన్నారు.