అడవుల సంరక్షణ అందరి బాధ్యత
ABN , First Publish Date - 2021-03-22T05:19:11+05:30 IST
అడవుల పునరుద్ధరణ సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని సంగారెడ్డి అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు అన్నారు.

సంగారెడ్డి రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు
ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన అధికారులు
గుమ్మడిదల, మార్చి 21: అడవుల పునరుద్ధరణ సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని సంగారెడ్డి అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు అన్నారు. ఆదివారం ప్రపంచ అటవీ శాఖ దినోత్సవంలో భాగంగా గుమ్మడిదల అటవీ సెక్షన్ రేంజ్ పరిధిలోని నల్లవల్లి- మంబాపూర్ అటవీ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు, ఎంపీపీ సద్ది ప్రవీణా భాస్కర్రెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులను కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అడవుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యలను వివరించారు. అనంతరం వారు మొక్కలను నాటారు. కాగా కొంతకాలంగా గుమ్మడిదల అటవీ సెక్షన్ పరిధిలో అడవుల అభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలను స్థానిక సర్పంచులు ప్రజలకు, అటవీశాఖ అధికారులకు క్షేత్రస్థాయిలో వివరించారు. కార్యక్రమంలో సర్పంచులు శంకర్, శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ మల్చీత్ సింగ్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
నర్సాపూర్: ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ రేంజ్ పరిధిలోని నర్సరీలో ఆదివారం అటవీశాఖ అధికారులు మొక్కలు నాటారు. ఎఫ్ఆర్వో అంబర్సింగ్ ఆధ్వర్యంలో సెక్షన్ అధికారి బాలేశం, బీట్ అధికారులు, సిబ్బంది కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఎవరికి వారు మొక్కలు నాటాలని పేర్కొన్నారు. చెట్లను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.