విధుల్లోంచి డీఐఈవో తొలగింపు
ABN , First Publish Date - 2021-10-21T04:48:19+05:30 IST
పరీక్షల నియంత్రణ కమిటీని నియమించడంలో లోటుపాట్లు జరగడంతో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హిమబిందును ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ బుధవారం విధుల్లో నుంచి తొలగించారు.
సూర్యప్రకాష్కు బాధ్యతల అప్పగింత
ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్
సిద్దిపేట ఎడ్యుకేషన్, అక్టోబరు 20: పరీక్షల నియంత్రణ కమిటీని నియమించడంలో లోటుపాట్లు జరగడంతో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హిమబిందును ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ బుధవారం విధుల్లో నుంచి తొలగించారు. ఈ నెల 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా పరీక్షల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ కమిటీలో ఇద్దరూ సీనియర్ ప్రిన్సిపాళ్లు, ఒక సీనియర్ లెక్చరర్ ఉంటారు. కమిటీలో నియమించిన సీనియర్ లెక్చరర్ అనారోగ్య పరిస్థితులతో రాలేకపోవడంతో మరొక సీనియర్ లెక్చరర్ను తీసుకోవాల్సి వచ్చింది. సీనియర్ను కాకుండా మినిమం పార్ట్టైం పే స్కేల్లో విధులు నిర్వహిస్తున్న లెక్చరర్ను డీఐఈవో హిమబిందు నియమించారు. దీంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఐఈవోపై బుధవారం కమిషనర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ హిమబిందును విధుల్లో నుంచి తొలగించారు. ఆమె స్థానంలో తూప్రాన్లో ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్న సూర్యప్రకా్షను డీఐఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన సూర్యప్రకాష్కు ఇంటర్మీడియట్ కళాశాలల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.