న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2021-11-01T04:59:08+05:30 IST
కంపెనీలో కూలీ చేయడానికి వెళ్లి విద్యుదాఘాతంతో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు, గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టారు. దీంతో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లోని కంపెనీ వద్ద ఆదివారం రో
![న్యాయం చేయాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/192110311119122/10312021232821n70.jpg)
కంపెనీ వద్ద మృతుడి బంధువుల ఆందోళన
ఏడున్నర గంటలపాటు కొనసాగిన ధర్నా
కంపెనీ వద్ద భారీ పోలీసు బందోబస్తు
పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకారం
తూప్రాన్ (మనోహరాబాద్), అక్టోబరు 31: కంపెనీలో కూలీ చేయడానికి వెళ్లి విద్యుదాఘాతంతో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు, గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టారు. దీంతో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లోని కంపెనీ వద్ద ఆదివారం రోజంతా ఉద్రిక్తత నెలకొన్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం దేవరయంజాల్ పరిధి సేవాలాల్ మల్లన్నతండాలో నివాసముండే రమావత్ నరేష్ (24) శనివారం మనోహరాబాద్ మండలం కాళ్లకల్ శివారులోని అడ్వాంటా యూపీఎల్ యూనైటెడ్ కంపెనీలో కూలీ కోసం వచ్చాడు. కంపెనీలోని బావిలో పూడికతీస్తుండగా కరెంటు సరఫరా జరగడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స కోసం మేడ్చల్లో ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
నరేష్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆదివారం ఉదయం 9 గంటలకు కుటుంబ సభ్యులు, బంధువులు, గిరిజన సంఘాల నాయకులు అడ్వాంటా యూపీఎల్ కంపెనీ వద్ద ఆందోళనకు దిగారు. రెండొందల మందికి పైగా ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో మనోహరాబాద్ ఎస్ఐ రాజుగౌడ్ ఆద్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4.30 గంటల వరకు బంజార సంఘం ప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులకు మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. మృతుడి కుటుంబానికి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు కంపెనీ ప్రతినిధులు ఆంగీకరించడంతో ఆందోళన విరమించారు. మృతుడి తల్లి రమావత్ కమలాబాయి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.