సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సీటీస్కాన్, ఐసీయూ
ABN , First Publish Date - 2021-03-21T06:05:08+05:30 IST
సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాధునిక సీటీ స్కాన్, 20 పడకల ఐసీయూ కేంద్రం నేడు మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి 20: సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాధునిక సీటీ స్కాన్, 20 పడకల ఐసీయూ కేంద్రం నేడు మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందుతున్నప్పటికీ స్కానింగ్ కోసం ప్రైవేట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తున్నది. ఈ సమస్యను గుర్తించిన మంత్రి హరీశ్రావు చొరవ తీసుకుని రూ. 2.15 కోట్లు వెచ్చించి సీటీ స్కాన్ యంత్రాన్ని తెప్పించారు. దీంతో నేటి నుంచి పేదలకు ఉచితంగా స్కానింగ్ సౌకర్యం అందుబాటులోకి రానున్నది. అలాగే, ఆస్పత్రిలో రూ. 2.40 కోట్ల వ్యవయంతో అత్యాధునిక ఐసీయూను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు 10 బెడ్లకే పరిమితమైన ఐసీయూకు మరో 10 పడకలను పెంచి అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసీయూకు ఒక్కరోజుకు రూ.10వేలు వసూలు చేస్తున్నారు. ఇకపై ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగానే ఐసీయూ సేవలు అందుబాటులోకి రానున్నఆరు.
లక్షకు చేరువలో డయాగ్నస్టిక్ టెస్టులు
రెండు నెలల క్రితం సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత డయాగ్నస్టిక్ సెంటర్లో ఇప్పటివరకు 99,971 టెస్టులు చేయడం విశేషం. జిల్లావ్యాప్తంగా 11,674 మందికి సంబంధించిన రక్త నమూనాలు సేకరించారు. వీరందరికి సంబంధించి సుమారు లక్ష పరీక్షలు చేశారు. దీంతో పేదలకు దాదాపు రూ. 3కోట్ల వరకు ఆదా అయ్యింది. పైసా ఖర్చులేకుండా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిని తీర్చిదిద్దుతున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.