పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2021-12-09T05:12:42+05:30 IST
నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ రమేష్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు
![పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నర్సాపూర్, డిసెంబరు 8: నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ రమేష్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఆర్డీవో ఏవో తభితరాణికి సూచించారు. నర్సాపూర్ డివిజన్ పరిధిలోని నర్సాపూర్, శివ్వంపేట, కొల్చారం, కౌడిపల్లి, చిల్పచెడ్ మండలాల స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు నర్సాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
పటిష్ఠ బందోబస్తు : ఎస్పీ చందనాదీప్తి
మెదక్అర్బన్, డిసెంబరు8: ఈనెల 10న జరుగనున్న స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు కల్పించనున్నట్లు ఎస్పీ చందనాదీప్తి బుధవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలో మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, తూప్రాన్ ఆర్డీవో ఆఫీసు, నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఇద్దరు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 16 మంది ఎస్ఐలు, 123 మంది కానిస్టేబుళ్లు, మహిళా సిబ్బంది, హోంగార్డులతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
144 సెక్షన్ అమలు : సీపీ జోయల్ డేవిస్
సిద్దిపేట క్రైం, డిసెంబరు 8: ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ఐదుగురు కానీ అంతకంటే ఎక్కువమంది కానీ గుంపులు గుంపులుగా తిరగకూడదని, మైకులు, లౌడ్ స్పీకర్లు వాడరాదని పాటలు, ఉపన్యాసాలు ఇవ్వకూడద సూచించారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాసులు కాల్చడం లాంటివి నిర్వహించడం నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.