జిల్లాలో బీజేపీ ఆకర్ష్ యత్నాలు!
ABN , First Publish Date - 2021-01-13T06:09:28+05:30 IST
జిల్లాలో బీజేపీ ఆకర్ష్ యత్నాలను చేపట్టింది. ప్రముఖ పార్టీల తీరుపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి చేరనున్న అసంతృప్త నేతలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జనవరి 12: జిల్లాలో బీజేపీ ఆకర్ష్ యత్నాలను చేపట్టింది. ప్రముఖ పార్టీల తీరుపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ నాయకత్వం వారితో చర్చలు జరుపుతున్నది. ప్రస్తుతానికైతే సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఇద్దరు, ముగ్గురు వారం లేదా పది రోజుల్లో బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. సదాశివపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడైతే ఈ నెల 18న బీజేపీలో చేరనున్నారు. కాంగ్రె్సకు గుడ్బై చెప్పిన వికారాబాద్కు చెందిన మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ ఈ నెల 18న బీజేపీలో చేరనున్నట్టు తెలిసింది. ఆయనకు సన్నిహితుడిగా మెలిగే సదాశివపేట కాంగ్రెస్ నాయకుడు కూడా అదే రోజు బీజేపీలో చేరతారని సమాచారం. ఇక కొండాపూర్ మండల స్థాయి టీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఒకరు కూడా బీజేపీలో చేరనున్నట్టు తెలిసింది. కొండాపూర్ మండలంలోని టీఆర్ఎ్సకు చెందిన ఒక సర్పంచ్ కూడా బీజేపీలో చేరే యోచనలో ఉన్నారు. ఇలాంటివారితో బీజేపీ నాయకత్వం రాయబారాలు నెరపుతున్నది. అలాగే జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుడొకరితో బీజేపీ నాయకత్వం చర్చలు జరిపినట్టు తెలిసింది. రానున్న ఎన్నికలలో పార్టీ టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు సదరు నాయకుడు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. మిగిలిన నియోకవర్గాల్లోనూ టీఆర్ఎస్, కాంగ్రె్సలో అసంతృప్తి నేతలతో బీజేపీ నాయకులు మంతనాలు సాగిస్తున్నారు.