మరో ఎనిమిది గిన్నిస్ రికార్డులే లక్ష్యంగా ‘ఆరెగామీ’ బొమ్మల ప్రదర్శన
ABN , First Publish Date - 2021-11-24T05:24:11+05:30 IST
ఇప్పటికే 13 గిన్నిస్ రికార్డులు సాధించిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మరో ఎనిమిది రికార్డులు లక్ష్యంగా మంగళవారం భారీ ప్రదర్శనను ఏర్పా టు చేశారు.
![మరో ఎనిమిది గిన్నిస్ రికార్డులే లక్ష్యంగా ‘ఆరెగామీ’ బొమ్మల ప్రదర్శన](https://media.andhrajyothy.com/appimg/galleries/192111231149355/11232021235318n78.jpg)
‘గీతం’లో ప్రదర్శించిన శివాలి శ్రీవాస్తవ
పటాన్చెరు రూరల్, నవంబరు 23 : ఇప్పటికే 13 గిన్నిస్ రికార్డులు సాధించిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మరో ఎనిమిది రికార్డులు లక్ష్యంగా మంగళవారం భారీ ప్రదర్శనను ఏర్పా టు చేశారు. ఆమె తల్లితండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవలతో కలిసి ఆరెగామీ పేపర్తో రూపొందించిన నెమళ్లు, కుక్కలు, బూరెలు, నిమ్మతొనలు, చేపలు, క్విల్లింగ్ దేవదూతలు, క్విల్లింగ్ బొమ్మలను ఒకేచోట ఉంచి, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు. ఆరెగామీ కాగితంతో తయారు చేయడం ఒక ఎత్తయితే, వాటన్నింటినీ ఒకేచోట ప్రదర్శనగా పెట్టడం మరో ఎత్తు. గీతం గణితశాస్త్ర విభాగ ప్రొఫెసర్ డి.మల్లికార్జునరెడ్డి వాటిని లెక్కించి అధికారికంగా ధ్రువీకరించారు. గీతం డైరెక్టర్లు స్వతంత్ర న్యాయ నిర్ణేతలుగా ఈ ప్రదర్శనను స్వయంగా తిలకించి ధ్రువీకరించిన పత్రాలను గిన్నిస్ అధికారులకు పంపి వారి ఆమోదం తరువాత రికార్డును ఖరారు చేయనున్నారు. శివాలీ ఇప్పటికే 13 గిన్నిస్ వరల్డ్ రికార్డులతో పాటు 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులు, నాలుగు యూనిక్ వరల్డ్ రికార్డులను నెలకొల్పిన విషయం విదితమే. లక్ష్యం మేరకు మరో ఎనిమిది గిన్నిస్ రికార్డులను శివాలి సాధించాలని గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎ్సఆర్ వర్మ, పలువురు అధ్యాపకులు ఆకాంక్షించారు.