రేషన్‌కార్డుల జారీ ఎప్పుడు?

ABN , First Publish Date - 2021-07-13T05:20:43+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాలో వేలాది మంది దరఖాస్తుదారులు రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.

రేషన్‌కార్డుల జారీ ఎప్పుడు?

- జోగుళాంబ గద్వాల జిల్లాలో 11,081 దరఖాస్తులు

    గద్వాల, జూలై 12 : జోగుళాంబ గద్వాల జిల్లాలో వేలాది మంది దరఖాస్తుదారులు రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల ఐదో తేదీ నుంచి రేషన్‌ కార్డులను జారీ చేస్తామని గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. కానీ కేత్ర స్థాయిలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త కార్డుల జారీపై ఇటీవల జరిగిన ఉండవెల్లి మండల సమావేశంలో పలువురు ఎంపీటీసీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని, అయితే కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. 


6,417 మంది అర్హుల గుర్తింపు

    జిల్లాలోని 12 మండలాలు, నాలుగు మునిసి పాలిటీలలో రేషన్‌కార్డుల కోసం మీ సేవాలో 11,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు విచారణ చేసి వారిలో 6,417 మందిని అర్హులుగా గుర్తించారు. ఇంకా 4,664 దరఖాస్తులపై విచారణ కొనసాగుతోంది. మొత్తం దరఖాస్తుల్లో పెండింగ్‌లో ఉన్నవి 2,459 కాగా, తహసీల్దార్‌, ఏఎస్‌ఓ వద్ద 233, డీఎస్‌వో వద్ద 1,914 పెండింగ్‌లో ఉన్నాయి. కాగా 58 దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. 2016, జనవరి ఒకటి నుంచి 2021 జూన్‌ 20 లోపు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. 


ప్రతీ నెల 3,324 టన్నుల బియ్యం

    జిల్లాలో 1,40,641 ఆహార భద్రత, 10,168 అంత్యో దయ, 141 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీరందరికీ సరుకులు పంపిణీ చేసేందుకు 334 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. ప్రతీ నెల 3,324 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు. 


Updated Date - 2021-07-13T05:20:43+05:30 IST