కరోనా వైరస్పై వార్
ABN , First Publish Date - 2021-05-07T04:35:13+05:30 IST
కరోనా వైరస్ కట్టడికి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నారు.
- కొవిడ్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు
- కదిలిన ప్రజాప్రతినిధులు, అధికారులు
- నిబంధనలు పాటించకపోతే జరిమానా
- మునగాలలో క్యారంటైన్ కేంద్రం ఏర్పాటు
గద్వాలక్రైం/అయిజ/మల్దకల్/ మే 6 : కరోనా వైరస్ కట్టడికి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఉన్నతా ధికారులు కొవిడ్ చికిత్సా కేంద్రాలను పరిశీలి స్తున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాలను తనిఖీ చేస్తున్నా రు. కొవిడ్ వ్యాప్తి నివారణపై పోలీస్ శాఖ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిబంధన లు పాటించని వారిపై చర్యలు తీసుకుంటోంది. పలు గ్రామ పంచాయతీలు స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. గ్రామాలు, మునిసిపాలిటీల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నారు.
కొవిడ్ పరీక్షా కేంద్రం తనిఖీ
గద్వాల పట్టణంలోని రాంనగర్ అర్బన్ హెల్త్సెంటర్లోని కొవిడ్ పరీక్షా కేంద్రాన్ని గురువారం జిల్లా ఎపిడాలమిస్ట్ క్రాంతి, హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పరీక్షలను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. పరీక్షల కోసం వచ్చే వారు భౌతికదూరం పాటించేలా చూడాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారికి కొవిడ్ కిట్ను అందించాలని చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారి ఇంట్లో తగిన వసతి లేకపోతే నదీ అగ్రహారంలోని పీజీ కళాశాలలో ఉన్న ఐసోలేషన్ కేంద్రానికి 108 ఆంబులెన్స్లో తరలించాలని సూచించారు. అనంతరం జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలోని కొవిడ్ పరీక్షా కేంద్రాలను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ కమ్యూనిటీ ఆర్గనైజర్ హనుమంతు, ఆరోగ్య కార్యకర్తలు సువర్ణ, రాములమ్మ ఉన్నారు.
మాస్క్లు తప్పనిసరి
ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అయిజ ప్రొబేషనరీ ఎస్ఐ బాలరాజు సూచించారు. గురువారం అయిజలో మాస్క్ లేకుండా రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానా విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అర్హులందరూ టీకా వేయించుకోవాలి
అర్హులైన వారందరూ కొవిడ్ టీకా వేయించు కోవాలని డిప్యూటీ జిల్లా వైద్యాధికారి శశికళ సూచించారు. గురువారం ఆమె అయిజ ప్రభుత్వాసుపత్రిని, కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అర్హులైనవారంతా కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, అనంతరం ఆధారాలతో ప్రభుత్వాస్ప త్రికి రావాలని సూచించారు. జ్వరం వచ్చిన వారి వివరాలను వైద్య సిబ్బంది సేకరిస్తోందని వివరించారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ కొవిడ్ పరీక్ష చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రామలింగారెడ్డి పాల్గొన్నారు.
నేటి నుంచి పాక్షిక లాక్డౌన్
కరోనా ఉధృతి రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో మల్దకల్లో శుక్రవారం నుంచి పాక్షిక లాక్డౌన్ అమలు చేయనున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ యాకోబు, యస్ఐ శేఖర్ గత రెండు రోజులుగా ప్రజలతో, వ్యాపారులతో విడివిడిగా సమావే శాలు నిర్వహించి ఈ విషయంపై చర్చించారు. అందరి ఆమోదం మేరకు శుక్రవారం నుంచి పాక్షిక లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా యస్ఐ శేఖర్ మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు. అదే సమయంలో ప్రజలు పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపారు. గ్రామంలో ప్రతీ ఒక్కరూ కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించా లని సూచించారు.
కరోనా కట్టడికి చర్యలు
కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అయిజ మునిసిపల్ చైర్మన్ దేవన్న అన్నారు. పట్టణంలోని 16వ వార్డులో గురువారం ఆయన పర్యటించారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. అంగుళం కూడా వదలకుండా ద్రావణం పిచికారి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
మునగాల పాఠశాలలో క్వారంటైన్ కేంద్రం
ఇటిక్యాల మే 6 : కరోనా బాధితులను ఆదుకు నేందుకు గ్రామపంచాయతీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. గ్రామస్థుల సహకారంతో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుం టున్నాయి. ఇటిక్యాల మండలంలోని మునుగాలలో సర్పంచు కొప్పుల జయలక్ష్మి నారాయణరెడ్డి తన స్వంత ఖర్చుతో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో ఇప్పటి వరకు 20 మంది దాకా వైరస్ బారిన పడ్డారని తెలిపారు. వారి ఇళ్లల్లో ప్రత్యేకంగా ఉండే వసతి లేకపోవడంతో పొలాల్లో వుంటున్నారని చెప్పారు. దీంతో గ్రామంలోనే క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు, కలెక్టర్ కు విన్నవించామని తెలిపారు. వైరస్ బారిన పడిన వారికి మందులు, వైద్య సేవలు అందించేం దుకు అంగీకరించారన్నారు. బాధితుల కోసం సమీపంలోని గురుకుల పాఠశాలలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతితో మరో రెండు రోజుల్లో క్వారంటైన్ కేంద్రాన్ని ప్రారంభి స్తామని తెలిపారు.