నేడు భోగి
ABN , First Publish Date - 2021-01-13T03:38:19+05:30 IST
మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు.

మూడు రోజుల పాటు సంక్రాంతి వేడుకలు
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల భిన్నమైన ఆచారాలు
పీడ పండుగ అంటూ చాలా చోట్ల సంబురాలకు దూరం
నల్లమలలో చింతపండు, బూడిదతో ఇష్ట దైవానికి నైవేధ్యం
కృష్ణానది తీర గ్రామాల్లో అట్టహాసంగా పండుగ
నాగర్కర్నూల్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. బుధవారం భోగితో వేడుకలు ప్రారంభం కానున్నాయి. భిన్న జాతులు, సంస్కృతులకు నిలయంగా ఉన్న జిల్లాలో సంక్రాంతి వేడుకలను వేర్వేరు ఆచారాలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో ప్రజలు ఈ పండుగను భిన్నమైన రీతుల్లో జరుపుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం..
చింతపండు, బూడిద నైవేద్యం
పండుగలు, పబ్బాలంటే పిండి వంటలు, వివిధ రకాల మాంసాహారాలు వండుకుని, ఆరగిస్తారు. అందుకు భిన్నంగా నల్లమల చెంచులు తమ ఇష్ట దైవం మల్లయ్య(శివుడు)కు చింతపండు, బూడిద కలిపి నైవేధ్యంగా సమర్పిస్తారు. సంక్రాంతి నుంచి వారు కూడా చింతపండు, బూడిద ఉండలు చేసుకొని తినడం ద్వారా ఆకలిని తీర్చుకుం టారు. ఈ పండుగకు చెంచుపెంటల్లో మ రో ప్రత్యేకత కూడా ఉంది. తమ ఆడబిడ్డ అయిన భ్రమరాంబ, మల్లయ్య ఒకరినొకరు ఇష్టపడి కల్యాణం చేసుకోవడానికి వెళ్తార ట. ఈ విషయం భోగి రోజున చెంచు పెద్దలకు సమాచారం అందుతుందట. ఆ మరుసటి రోజు భ్రమరాంబ, మల్లికార్జున్లను పిలిపించుకొని వారి ఇష్టప్రకారం ఇద్దరికి వివాహం నిశ్చయం చేస్తారట. శివరాత్రి రోజు ముహూర్తం నిర్ణయిస్తారు. నల్లమలలోని భౌరాపూర్లో శ్రీశైలం కంటే పురాతనమైన భ్రమరాంబ మల్లికార్జున్ స్వామి దేవాలయంలో ప్రతి ఏటా శివరాత్రి రోజున వారి కల్యాణం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బౌరాపూర్లో భ్రమరాంబ మల్లికార్జున్ల కల్యాణోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకను తిలకించడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న చెంచులందరూ భౌరాపూర్కు చేరుకుంటారు. దేవుడికి చింతపండు, బూడిదతో నైవేద్యం సమర్పించడం వెనక శాస్త్రీయత కూడా ఉందని ఇక్కడి చెంచులు భావిస్తుంటారు. సంక్రాంతి సమయానికి అటవీ ప్రాంతంలో చింతపండు విస్తృతంగా లభించడం ప్రారంభమవుతుంది. చెంచు గడ్డ, ఎరువల గడ్డ, నూల గడ్డలలో చిరుమాన్, మద్ది, ప్రాచీనమైన చింతచెట్టుకు సంబంధించిన కొమ్మలను కాల్చి వాటి ద్వారా వచ్చిన బూడిదను చింతపండులో మిళితం చేస్తారు. వీటిలో ఉండే ఔషధ గుణాల కారణంగా వ్యాధి నిరోధక శక్తి పెరగడంతోపాటు చలికాలంలో వచ్చే అనేక రోగాల నుంచి బయటపడుతామని తమ పూర్వీకులు చెప్పారని, ఈ పద్ధతినే తామూ ఆచరిస్తున్నామని చెంచు గురువయ్య ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
ఏటి ఒడ్డున..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో కొంత భాగం సంక్రాంతి పీడ పండుగ అం టూ వివిధ కార్యక్రమాలను వాయిదా వేయడం ఆన వాయితీగా వస్తోంది. భోగి రోజు ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న కలపతో బయట మంట పెడతారు. మరుసటి రోజు వ్యవసాయంలో తమకు అండగా ఉన్న పశువులను, బండ్లను అందంగా అలం కరించి, ఎద్దుల బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు. అయితే జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న పల్లెల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. 120 కిలో మీటర్ల దూరం ప్రవహించే ఏటికి కుడి వైపున కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరి హద్దు ఉంది. నది పరివాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కర్నూల్, ప్రకాశం, గుంటూరు, విశాఖ ప ట్నం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన జాల ర్లు చాలాకాలంగా ఇక్కడే స్థిరపడి పోయా రు. వీరికి తెలంగాణ లోని నారాయణపేట, మక్తల్, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిల ప్రాంతాలకు చెందిన వారితో సంబం ఽధ చుట్టరి కాలున్నాయి. తీర ప్రాంతాల వెంట నివసిస్తున్న వారికి పిల్లనివ్వడం, అక్కడి నుంచి సంబంధాలు చేసుకోవడంతో ఇక్కడ సంక్రాంతి సంబురాలపై తీవ్రమైన ప్రభావం ఉంది. ఉమ్మడి జిల్లాలో మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఇక్కడ పండుగకు కూతురు, అల్లుడిని పిలిచుకోవడం, కొత్తదుస్తులు ధరించడం, వాహనాలు కొనుగోలు చేయడంతోపాటు గృహ నిర్మాణాలను ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారు. సంక్రాంతి రోజు పిండి వంటకాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. కనుమ రోజు మాంసాహారాన్ని తింటారు. ఆ రోజే గ్రామాల్లో ఉత్సవమూర్తులను ఊరు బయటకు తీసుకెళ్తారు. వాటికి కిలో మీటరు దూరంలో పోటేళ్లు లేదా మేకపోతును ఉంచి, దాని తోకను కోసి కారం పెట్టి పరిగెత్తించే వింత ఆచారం కూడా ఉంది. గ్రామంలోని యువకులు దాన్ని పట్టుకొని తెచ్చేంత వరకు ఉత్సవ విగ్రహం గ్రామంలోకి తీసుకురారు.
ప్రత్యేకతలివీ..
సంక్రాంతి పండు గను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. భోగి రోజు బుధవారం నువ్వుల రొట్టెలు, అన్ని కూరగాయలతో కూ ర చేసుకుని ఆరగిస్తారు. గురు వారం సంక్రాంతి సందర్భంగా ఆల యాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. పిండి వంటలు చేసుకుంటారు. ఆలయాల వద్ద ఎద్దుల బండ్లు, వాహనాల ఊరేగింపు నిర్వహి స్తారు. కనుమ రోజు శుక్రవారం మాంసా హారాలు చేసుకుని
భుజిస్తారు.
