అమరవీరుల త్యాగం మరువలేనిది
ABN , First Publish Date - 2021-10-27T05:11:17+05:30 IST
అమరవీరుల త్యాగం మరువలేనిదని, వారోత్సవాలలో వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఎస్పీ రంజన్ రతన్కుమార్ అన్నారు
- ఎస్పీ రంజన్ రతన్కుమార్
- జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీ
గద్వాల క్రైం, అక్టోబరు 26 : అమరవీరుల త్యాగం మరువలేనిదని, వారోత్సవాలలో వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఎస్పీ రంజన్ రతన్కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ (ఫ్లాగ్డే) వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందరర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజారక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగిపోతున్న పోలీసుల కృషి అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం ఫ్లాగ్డే నిర్వహిస్తున్నామన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలతో మరింత మమేకం అవుతూ, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజీవ్ మార్గ్, ఫ్లై ఓవర్, కలెక్టరేట్, జమ్మిచేడు, పుటాన్పల్లి స్టేజీ, అనంతపూర్ స్టేజీ ఎర్రవల్లి మీదుగా బీచుపల్లి వరకు కొనసా గింది. ర్యాలీలో డీఎస్పీ రంగస్వామి, గద్వాల సీఐ షేక్ మహబూబ్ బాషా, ఆర్.ఐ.నాగేష్, పట్టణ ఎస్ఐలు హరిప్రసాద్రెడ్డి, రమాదేవి పాల్గొన్నారు.