అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-12-08T04:14:46+05:30 IST

కోస్గిలో వెలిసిన అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి మునిసిపల్‌ కమిషనర్‌ మల్లికార్జునస్వామిని ఆదేశించారు.

అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కోస్గి, డిసెంబరు 7 : కోస్గిలో వెలిసిన అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి మునిసిపల్‌ కమిషనర్‌ మల్లికార్జునస్వామిని ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ఏబీకే ఫంక్షన్‌ హాలులో మునిసిపల్‌ సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. గతంలో కోస్గి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వెంచర్లు వెలిసిన క్రమంలో గ్రామ పంచాయతీకి 10 శాతం వాటా భూమిని రిజిస్టర్‌ చేసుకోకుండా తిరిగి ప్లాట్లుగా చేసి అమ్ముకున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గోవర్ధన్‌రెడ్డి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మునిసిపాలిటీలో జరుగుతున్న వెంచర్లలో 10 శాతం మునిసిపల్‌ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామ పంచాయతీ నుంచి మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో గ్రామ కంఠంలో ఉన్న ఇంటి నిర్మాణాలకు వెంటనే ఇంటి నెంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ కమిషనర్‌కు కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సూచించారు. మునిసిపాలిటీలో ఉన్న వెంచర్ల 10 శాతం భూమిని వెంటనే పంచనామా నిర్వహించి కలెక్టర్‌కు నివేదిక పంపించాలన్నారు. మిషన్‌ భగీరథ పనులను వెంటనే పూర్తి చేస్తూ పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న అక్రమ డబ్బాలను తొలగించాలని అదనపు కలెక్టర్‌ మునిసిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. 


Updated Date - 2021-12-08T04:14:46+05:30 IST