అమరులకు సెల్యూట్
ABN , First Publish Date - 2021-10-21T05:39:29+05:30 IST
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎంతో మంది పోలీసులు సంఘ విద్రోహుల చేతిలో అసువులు బాశారు. సమాజ శాంతి కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతున్నారు.

నేడు పోలీసు ఫ్లాగ్ డే
మహబూబ్నగర్, అక్టోబరు 20: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎంతో మంది పోలీసులు సంఘ విద్రోహుల చేతిలో అసువులు బాశారు. సమాజ శాంతి కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దశాబ్దంన్నరపాటు పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగింది. 1990 నుంచి 2006 వరకు జరిగిన ఈ పోరులో 39 మంది పోలీసులు అమరులయ్యారు. 1993లో సోమశిల వద్ద జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మావోయిస్టులు మందు పాతర పేల్చడంతో అప్పటి జిల్లా ఎస్పీ పరదేశీనాయుడుతో పాటు 9 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్నగర్ జిల్లాలో నక్సల్స్ చేతిలో ఇద్దరు పోలీసులు చనిపోయారు. 2004లో అడ్డాకులలో ఎంపీపీ కందూరు నారాయణపై కాల్పులు జరుపగా, ఆయన గన్మెన్ అయిన కానిస్టేబుల్ సుగుణాకర్ చనిపోయారు. 2005లో బాలానగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రకాష్పై కాల్పులు జరిపి, హత్య చేశారు. పోలీసు అమరులను స్మరించుకుంటూ పోలీసు శాఖ ఏటా అక్టోబరు 21న పోలీస్ ఫ్లాగ్ డేను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే మహబూబ్నగర్లోని పరేడ్ మైదానంలో గురువారం ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు పోలీసు అమరుల కుటుంబ సభ్యులు, పోలీసులను ఉద్దేశించి సందేశమిస్తారు. ఆ తరువాత ఎస్పీ కార్యాలయంలోని అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడినుంచి పోలీసులు, అమరుల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు ర్యాలీగా వన్టౌన్ చౌరస్తాకు చేరుకుని, ఎస్పీ పరదేశీనాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.