అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-09-04T04:28:21+05:30 IST
పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

- కలెక్టర్ వల్లూరు క్రాంతి
- వివిధ శాఖల అధికారులతో సమీక్ష
- పట్టణ ప్రగతి, వ్యాక్సినేషన్పై చర్చ
గద్వాల క్రైం, సెప్టెంబరు 3 : పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమా వేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 259 పల్లె ప్రకృతి వనాలకు గాను ఎన్ని పూర్తయ్యాయి, డంపింగ్ యా ర్డులు, వైకుంఠధామాల పనులు ఏ మేరకు పూర్తయ్యా యి తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ పనులను ప్రజలు, అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాపించకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయించాలని సూచించారు. పంచాయితీ రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చూడాలన్నారు. గ్రామాలలో వైకుంఠ ధామా ల పనులు పూర్తయ్యాయని అఽధికారులు తెలిపారు. 44వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పా టు చేయాలని అఽధికారులను ఆదేశించారు. సెగ్రిగేషన్ షెడ్లను సత్వరమే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, డీఆర్డీవో ఉమాదేవి, డీపీవో శ్యామ్ సుందర్, పీఆర్ఈఈ సమత తదితరులు పాల్గొన్నారు.
85 శాతం మంది ఉపాధ్యాయులకు టీకా
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు ఇప్పటివరకు 85 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలకు విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉందని చెప్పారు. ఇతర శాఖల సిబ్బందికి 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిందని తెలిపారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మధ్యాహ్న భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.
సదుపాయాల కల్పనకు కృషి
ప్రతీ పట్టణంలో అన్ని సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంపై జిల్లాలోని గద్వాల, అలంపూర్, వడ్డేపల్లి మునిసిపల్ కమిషనర్లతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రోడ్లు, పార్కులు, మరుగుదొడ్లు, సెగ్రిగేషన్ షెడ్లు, వైకంఠదామాల నిర్మాణం ఏ మేరకు పూర్తయ్యిందని కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. గద్వాల మునిసిపాలిటీ పరిధిలో 37 వార్డులు ఉండగా, అందులో 33 వార్డుల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. పది వార్డుల్లో ప్రకృతి వనాలు పూర్తయ్యాయని చెప్పారు. అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో వైకుంఠ ధామం పనులకు టెండర్ పూర్తయ్యిందని, త్వరలో పనులు మొదలు పెడతామని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గద్వాల పట్టణంలో మరుగుదొడ్లు ఎక్కడ నిర్మించారని, వాటి నిర్వహణ బాధ్యత ఎవరిదని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మిగితా మునిసిపాలిటీల్లోనూ ప్రవేట్ వ్యక్తుల ద్వారా మరుగుదొడ్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి వానాల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ల మధ్య డివైడర్లపై ప్లాంటేషన్ సక్రమంగా నిర్వహించి, రోజూ రెండుసార్లు మొక్కలకు నీరు పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, కమిషనర్లు శ్రీనివాస్రెడ్డి, నర్సయ్య, పల్లారావు, నిత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.