అలంపూరు ఎక్సైజ్ పనితీరు భేష్
ABN , First Publish Date - 2021-06-19T05:58:42+05:30 IST
కర్ణాటక మద్యం పట్టివేతలో అలంపూరు ఎక్సైజ్ శాఖ పనితీరు భేష్ అని మహబూబ్నగర్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ దత్తరాజ్ గౌడ్ అన్నారు.
- మహబూబ్నగర్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ దత్తరాజ్ గౌడ్
అలంపూరు, జూన్ 18 : కర్ణాటక మద్యం పట్టివేతలో అలంపూరు ఎక్సైజ్ శాఖ పనితీరు భేష్ అని మహబూబ్నగర్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ దత్తరాజ్ గౌడ్ అన్నారు. అలంపూరు ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామంలోని ఓ ఇంట్లో కర్ణాటక రాష్ర్టానికి చెందిన 33 మద్యం కాటన్లను అక్రమంగా నిల్వ ఉంచారని తెలిపారు. అలంపూరు ఎక్సైజ్ సీఐ బనావత్ పటేల్ శుక్రవారం సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై దాడి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.1.32 లక్షలు ఉంటుందన్నారు. మద్యంతో పాటు ఒక బైక్ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని పట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో గద్వాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు, అలంపూరు ఎక్సైజ్ సీఐ బనావత్ పటేల్, గణపతి రెడ్డి, రమణయ్య, గోపాల్, ఎస్ఐ అనంత రెడ్డి పాల్గొన్నారు.