ఇదేం.. చోద్యం!
ABN , First Publish Date - 2021-02-28T04:00:29+05:30 IST
నడిగడ్డతో పాటు ఉమ్మడి పాలమూ రు జిల్లాకు తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మించారు.
- ఆక్రమణలో జూరాల ప్రాజెక్టు భూములు
- భూ సేకరణ సమయంలో రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించని అధికారులు
- వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు అధికారులకు ముడుపులు
- ప్లాట్లుగా మార్చి ‘క్యాష్’ చేసుకుంటున్న అక్రమార్కులు
- కలెక్టర్ ఆదేశాలతో విచారణ
- 72 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు నిర్ధారణ
గద్వాల, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : నడిగడ్డతో పాటు ఉమ్మడి పాలమూ రు జిల్లాకు తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మించారు. నిర్మాణ సమయంలో కుడి, ఎడమ కాల్వలు, అండర్ ట న్నెల్ నిర్మాణాల కోసం రైతుల నుంచి వేల ఎకరాల భూములను సేకరించా రు. ప్రస్తుతం అధికారులు సేకరించిన కుడి, ఎడమ కాల్వలను ఆనుకొని ఉన్న భూములను కొందరు ఆక్రమించుకున్నారు. ఏకంగా ప్లాట్లుగా చేసి ఇతరులకు అంటగడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులు సహకారం అందిస్తుండగా, రాజకీయ ఒత్తిళ్లతో ఇరిగేషన్ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఆక్రమణ బయట పడిందిలా..
జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలలో సర్వే నంబర్ 208లో 7.13 ఎకరాల భూమి ఉంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూ సేక రణలో భాగంగా ఈ భూమిని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీ నం చేసుకుంది. బాధిత రైతులకు పరిహారం కూడా చెల్లించింది. కానీ, భూమి ని ఇరిగేషన్ శాఖ రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించకుండా నిర్లక్ష్యం చేసిం ది. అయితే, తెలంగాణ ఏర్పాటు అనంతరం గద్వాల జిల్లాగా అవతరించడం, ‘రియల్’ వ్యాపారం పుంజుకోవడంతో అక్రమార్కుల కన్ను ఈ భూమిపై ప డింది. దీంతో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న రైతులకు కొంత డబ్బును ముట్టజెప్పి భూములను కొనుగోలు చేసింది. రెవెర్యూ అధికారులకూ భారీగా ముడుపులు చెల్లించి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి అ నుమతులు తీసుకుంది. ఈ భూమి రియల్ వెంచర్గా మార్చేసింది. ప్లాట్లు చేసి రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు అమ్మకాలు జరిపింది.
ఈ తతంగాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ‘జూరాల భూమిలో.. రియల్ వెంచర్’ కథనం తో వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా రెవెన్యూ యంత్రాంగం చేసి న తప్పులను సరిదిద్దుకోవడానికి ఇచ్చిన అనుమతలను రద్దుకు సిఫార్సు చే సింది. ఈ కథనంపై స్పందించిన కలెక్టర్ జూరాల కింద ఎన్ని భూములు ఆ క్రమణకు గురయ్యాయో విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ విచారణలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 72 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించింది. అం దులో అలంపూర్ మండలంలోని నాలుగు గ్రామాల్లో 48.39 ఎకరాలు, ధరూర్ మండలంలోని నాలుగు గ్రామాల్లో 11.24 ఎకరాలు, గద్వాలలో 2.13 ఎకరాలు, ఇటిక్యాలలో 5.04 ఎకరాలు, మానవపాడులో నాలుగు ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు కలెక్టర్కు నివేదిక అందించారు. ప్రస్తుత మా ర్కెట్ ధర ప్రకారం వీటి విలువ రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఉం టుందని అంచనా.