తొలి అడుగులోనే బీజేపీకి ఝలక్!
ABN , First Publish Date - 2021-07-14T04:45:48+05:30 IST
టీపీసీసీ అధ్యక్షుడయ్యాక రేవంత్రెడ్డి..
వేడెక్కిన రాజకీయం
ఉమ్మడి పాలమూరు జిల్లాపై రేవంత్రెడ్డి స్పెషల్ ఫోకస్
హస్తం గూటికి బీజేపీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్
బీసీల్లో సానుకూలత రాబట్టేందుకు యత్నం
(మహబూబ్నగర్-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీపీసీసీ అధ్యక్షుడయ్యాక రేవంత్రెడ్డి పాలమూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి ద్విముఖ వ్యూహం తెరమీదకు తెచ్చారు. పార్టీలో ఉన్న సీనియర్లు, నాయకులు, క్యాడర్ని క్రియాశీలకం చేయడంతో పాటు బలమైన వర్గాలు, బలమైన ఇతర పార్టీల నాయకులు, గతంలో పార్టీలో పని చేసి వేర్వేరు కారణాలతో దూరమైన వారు, తటస్తులను పార్టీలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కార్యాచరణను లోలోపల అమలు చేస్తున్నారు.
2018 అసెంబ్లీ, 2019 లోక్సభ, ఆ తర్వాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస ఓటములతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బేలగా మారింది. పట్టున్న నాయకులు, బలమైన క్యాడర్ టీఆర్ఎస్, బీజేపీలోకి చేరడం వంటి రాజకీయ పరిణామాలతో పార్టీకి మరింత ఇబ్బందిగా పరిస్థితి మారింది. ఇన్ని ఒడిదుడుకుల్లోనూ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న క్యాడర్, పార్టీ ఓటు బ్యాంకును కాపాడుతూ వచ్చారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్కు 70 శాతం స్థానాల్లో కాంగ్రెస్సే పోటీ ఇచ్చింది. పార్టీ డీలా పడ్డ ఈ పరిస్థితుల్లో తాజాగా రేవంత్ పగ్గాలు చేపట్టడంతో కొత్త సమీకరణలకు తెరలేచినట్లయింది. బీజేపీ, టీడీపీ, వామపక్ష పార్టీల్లోని క్రియాశీలక, పట్టున్న నాయకులను గుర్తించి, వారిని కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానిస్టున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్లోనూ అసంతృప్తితో, ఎదగలేకపోతున్నామనే భావనతో ఉన్న కీలక నాయకులకు కూడా గుర్తించి పార్టీలోకి రమ్మని పిలుపునిస్తున్నట్లు సమాచారం.
ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక క్రియాశీలక నాయకుడు ఇటీవల కర్ణాటకలోని రాయచూరు వెళ్లి మరీ తెలంగాణ పీసీసీ ఇన్చార్జిగా ఉన్న బోసురాజుని కలిసినట్లు సమాచారం. ఈయన రేవంత్రెడ్డి నుంచే కాకుండా, పార్టీ అధిష్ఠానం నుంచి తమ రాజకీయ భవిష్యత్పై స్పష్టత ఇస్తే పార్టీలోకి వచ్చేందుకు సన్నద్ధత చూపినట్లు తెలిసింది. కీలక నాయకులే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రియాశీలకంగా పని చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు, యువజన నాయకులు, ఇతర పార్టీల్లో ఉన్న యువ నాయకులు కొందరు రేవంత్ నాయకత్వంలో పని చేస్తే ఎలా ఉంటుందని సన్నిహితుల వద్ద చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఎర్ర శేఖర్కు గుర్తింపు
బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరతానని ప్రకటించిన మరాఠా చంద్రశేఖర్ (ఎర్ర శేఖర్) ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. తన సోదరుడు దివంగత ఎర్ర సత్యం మరణానంతరం క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన శేఖర్, తొలుత టీడీపీ నుంచి 1995లో జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1999లోనూ గెలుపొంది, 2004, 2008 ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో తిరిగి టీడీపీ నుంచి గెలుపొందారు. 2014లో జడ్చర్ల నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో మహబూబ్నగర్ అసెంబ్లీ నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా (టీడీపీ) పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో బీజేపీలో చేరారు. బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
అయితే, ఆ పార్టీలో చేరినప్పటి నుంచి శేఖర్కు పొసగని పరిస్థితి ఏర్పడింది. సంజయ్ జిల్లా పర్యటన సందర్భంగా తనకు ప్రాధాన్యత దక్కడం లేదనే కారణంతో రాజీనామా ప్రకటించినా, ఆ తర్వాత పార్టీ ముఖ్య నాయకులు సర్ది చెప్పడంతో రాజీనామా వెనక్కి తీసుకున్నారు. పార్టీలో కొనసాగుతున్నా, క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షులవడం, గతంలో టీడీపీలో కొనసాగిన సమయంలో ఇద్దరి మధ్య సత్సంబంధాలుండటం వంటి కారణాలతో కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్న శేఖర్ మంగళవారం హైదరాబాద్లో రేవంత్రెడ్డిని కలిశారు. అక్కడే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగైదు రోజుల్లో అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరుతానని స్పష్టం చేశారు. శేఖర్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించడం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో బీసీ వర్గాల్లో సానుకూలత పెంచుకునేందుకు కాంగ్రెస్కు అవకాశం దక్కినట్లయిందనే విశ్లేషణ సాగుతోంది.